శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (10:13 IST)

తెలంగాణాలో కేసీఆర్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న మహిళ ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తోంది. ఇంతకీ ఆ మహిళ కూడా తెలంగాణ ముద్దుబిడ్డే కావడం గమనార్హం. ఆ మహిళ ఎవరో తెలుసా..? ఓ న్యాయవాది. ప

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాపిస్తోంది. ఇంతకీ ఆ మహిళ కూడా తెలంగాణ ముద్దుబిడ్డే కావడం గమనార్హం. ఆ మహిళ ఎవరో తెలుసా..? ఓ న్యాయవాది. పేరు రచనా రెడ్డి. మెదక్ జిల్లా నాగిరెడ్డిపేట వాసి. నల్సర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంతకీ ఈమెను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వణికిపోతున్నారో తెలుసుకుందాం? 
 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే కథనరంగంలోకి దిగారు. ఇందులోభాగంగా, తెలంగాణాను సస్యశ్యామలం చేయాలన్న కృతనిశ్చయంతో ఆయన భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించతలపెట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను అడ్డగోలుగా సేకరించేందుకు నడుం బిగించారు. ఇందుకోసం జీవో 123ని జారీ చేశారు. 
 
ఇక్కడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పప్పులో కాలేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా న్యాయవాది రచనా రెడ్డి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా, ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ జీవోను కొట్టివేసింది. ఇది తెరాస సర్కారుతో పాటు.. కేసీఆర్‌కు తీవ్ర పరాభవంగా మారింది. దీంతో రచనారెడ్డిపై కేసీఆర్ విమర్శలదాడికి దిగారు. అయినా రచనా రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. భయపడలేదు. బెదరలేదు. 
 
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెరాస ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు భూసేకరణపై పోరాటం చేస్తూనే.. భూమిని కోల్పోతున్న భూనిర్వాసితులకు, ముంపు బాధితులకు అండగా నిలిచారు. దీంతో ప్రభుత్వం సాఫీగా భూసేకణ చేపట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో రచనా రెడ్డి పేరు ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆమె పేరెత్తితేనే సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తం తెలంగాణ బిడ్డను అని చెప్పుకునే కేసీఆర్‌కు ఆ తెలంగాణ బిడ్డే ముప్ప తిప్పలు పెడుతోంది. 
 
కాగా, రచనా రెడ్డి పూణెలో విద్యాభ్యాసం చేసంది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి.. అక్కడే ఉన్న ల్యూపెస్టర్ యూనివర్శిటీలో అంతర్జాతీయ మానవహక్కుల అంశంపై పీహెచ్‌డీ చేస్తోంది. అంతేకాకుండా, మానవహక్కుల కమిషన్‌లో ఉన్న 11 మంది న్యాయవాదుల బృందంలో ఆమె ఒక సభ్యురాలు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాది. మూడున్నరేళ్ళ పాటు అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘనపై పోరాటం చేసిన రచనా రెడ్డి ఇపుడు తన సొంత జిల్లాకు వచ్చి అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా నడుంబిగించింది. భూనిర్వాసితులు. ముంపు బాధితులకు అండగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలు నిర్ణయాలతో ముందుకెళుతున్న కేసీఆర్‌ స్పీడుకు ఆమె బ్రేక్‌లు వేసింది.