శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (09:08 IST)

''నిర్బంధ తమిళం'' తెలుగు గోవిందా!!: ఎమ్మెల్యే ఆవేదన.. తమిళనాట కనుమరుగవుతున్న తెలుగు!!

నిర్బంధ తమిళంతో తెలుగువారు మాతృభాషను చదువుకోవడం మానేస్తున్నారు. తెలుగువారిగా పుట్టి.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో స్థిరపడి.. ఆ ప్రాంత భాషలకు అలవాటుపడిపోయిన తెలుగువారు వారి మాతృభాషను మాట్లాడటం లేదు సరికదా.. ఆ భాషను చదువుకోవడంపై ఎలాంటి ఆసక్తి చూపట్లేదు. దీంతో తెలుగు భాషను, ఆ భాషా సాహిత్యాన్ని చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. 
 
ఎంసీఏలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి కోర్సుల్నే ఎంచుకుంటున్న తెలుగువారు.. మాతృభాషపై మక్కువ చూపట్లేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషను చదువుకునే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాట ఏర్పడింది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి తెలుగు భాషకు తమిళనాట మంచి పేరుండేది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన కోర్సులు.. ఆ రాష్ట్ర పాఠశాల, కాలేజీల్లో ఉండేవి. అయితే తమిళనాట తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను ఒక్క లాంగ్వేజ్‌గా తీసుకుని చదివే వారి సంఖ్య పడిపోయింది. అయితే దీనిపై ఓ తెలుగు ఎమ్మెల్యే తమిళనాడు అసెంబ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తమిళనాడులో 2006లో డీఎంకే ప్రభుత్వం 'నిర్బంధ తమిళం' పేరుతో జారీ చేసిన జీవోపై తెలుగు ఎమ్మెల్యే కె.గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ, తమ పిల్లలను మాతృభాషలో చదువుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగని తాము తమిళ భాషకు విరుద్ధం కాదన్నారు. తమ మాతృభాషను కూడా చదువుకుంటామని, అందుకుతగిన ఏర్పాట్లు చేయాలని సభలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
 
అంతేగాక తమిళనాట మైనారిటీ భాషలైన తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ జీవోతో తమిళనాడులోని వందలాది మంది తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారన్నారు. జీవో సాకుతో ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో తెలుగు సబ్జెక్టును తీసేస్తున్నారని, తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా పెట్టడం వల్ల మార్కులు ఉండవన్న ఉద్దేశంతో తెలుగు విద్యార్థులు మాతృభాషను వదిలేస్తున్నారని తెలిపారు. 
 
2012లో సీఎం జయలలిత శాసనసభ సాక్షిగా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమని తెలుగులోనే హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పుకొచ్చారు. ఇక్కడ విశేషమేంటంటే... తెలుగు విద్యార్థులకు మద్దతుగా మాట్లాడాలంటూ సభలో ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే వినతిపత్రాలు ఇచ్చారు. కానీ ఆయన మాట్లాడుతున్న సమయంలో మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, తమిళనాడులోని తెలుగువారి సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 10న హైదరాబాద్‌లో తమిళనాడు తెలుగు సంఘాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం ధర్నా వాల్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఇందిరాపార్కులో ఆ ధర్నా జరగనుంది. మరి ఈ ధర్నాకైనా తెలుగువారి మద్దతు లభించాలని ఆశిద్దాం..