బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 4 నవంబరు 2014 (17:26 IST)

పాక్ లో క్రికెట్టా... ఉగ్రవాదులతో తల గోక్కోవడమే... దాడులతో రూ.4.5 వేల కోట్ల నష్టం

ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ దేశం అనేట్లుగా పరిస్థితి మారిపోతోంది. వాఘా సరిహద్దులో ఆత్మాహుతి దాడితో మరోసారి పాకిస్తాన్ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అక్కడ ఏదైనా ఉత్సవాన్ని బయట పెద్ద సమూహంలో నిర్వహించుకోవాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. ఎపుడు ఏ ఉగ్రవాద సంస్థ దాడికి తెగబడుతుందోనన్న భయంతో బతుకుతున్నారు అక్కడి జనం. 
 
ఉగ్రవాదుల చర్యలతో పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిని సందర్శించేందుకు పర్యాటకులు రావడం మానేశారు. దీంతో పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. సుమారు 44 మిలియన్ డాలర్ల మేర నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
ఇక క్రికెట్ సంగతి సరేసరి. ఒకనాడు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ అంటే... ఆ జట్లు ఎక్కడ ఆడుతున్నా జనం విరగబడి చూసేవారు. టిక్కెట్లు అమ్ముడయిపోవడమే కాక ప్రకటనల రూపంలో కోట్లకు కోట్లు వచ్చిపడేవి. అలాంటి పరిస్థితి మారిపోయింది. ఇపుడు పాకిస్తాన్ దేశంలో క్రికెట్ అంటే ఉగ్రవాదులతో తల గోక్కోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్తాన్ జట్టుతో ఆడేందుకు ఆ దేశంలో పర్యటించాలంటే వణుకుతున్నాయి. 
 
ఫలితంగా పాకిస్తాన్ కు 51.22 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఇలా మొత్తంగా ఉగ్రవాద దాడులతో పాకిస్తాన్ సుమారు రూ. 4.5 వేల కోట్ల నష్టాలను మూటగట్టుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2001-07 మధ్య కాలంలో పాకిస్తాన్ దేశంలో 15 ఆత్మాహుతి దాడులు జరిగాయంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు... మొన్నటి వాఘా సరిహద్దులో జరిగిన ఆత్మాహుతి దాడికి తాము కారణమంటే తాము కారణమని ఉగ్రవాద సంస్థలు పోటీపడటం అక్కడి తీవ్రవాద సంస్థల ధోరణిని అద్దం పడుతుందు.