గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మండింది... జగన్ గూటికి చేరిపోతారా?
విజయవాడ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెడ్ కార్పెట్ పరచడం చాలామందికి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా నెహ్రూ బద్ధశత్రువు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈ పరిణామం మంటగా మారింది. గతంలో
విజయవాడ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెడ్ కార్పెట్ పరచడం చాలామందికి మింగుడుపడటం లేదు. ముఖ్యంగా నెహ్రూ బద్ధశత్రువు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈ పరిణామం మంటగా మారింది. గతంలో నెహ్రూ, వంశీ ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడిన సంఘటనను ఆంధ్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. నెహ్రూను ముసలి రౌడీగా అభివర్ణిస్తూ, వల్లభనేని వంశీ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. నెహ్రూ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని వంశీ బహిరంగంగానే అప్పట్లో ఆరోపణలు చేశారు.
విజయవాడ పోలీస్ కమిషనర్కి నెహ్రూపై ఫిర్యాదు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో దేవినేని నెహ్రూ హవా నడిచింది. ఇపుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెహ్రూ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. అధికారంలో ఉన్నా... గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన పాత గొడవలను మరచిపోయి... ఎమ్మెల్యేగా హుందాగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి గొడవలకూ దిగడం లేదు.
కానీ, ఇపుడు అకస్మాత్తుగా కాంగ్రెస్ నుంచి నెహ్రూ టీడీపీలోకి చేరడం... అదీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంతో వంశీకి ఇక మండిపోతోంది. ఈ తాజా మార్పులతో టీడీపీలో వంశీ అస్సలు ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది. ఎలాగో జగన్తో సత్సంబంధాలున్నాయి కాబట్టి వైసీపీలో చేరేందుకు వంశీ రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరపున మళ్ళీ పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో వంశీ ఉన్నట్టు సమాచారం.
పైగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడలో వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులు కావడంతో ఆయనకు వైసీపీ ఘన స్వాగతం పలుకుతుందంటున్నారు. వంశీ త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదేగాని జరిగితే, వంశీ కారణంగా తిరిగి వైసీపీలోకి రిటర్న్ వలసలుంటాయని అంచనా వేస్తున్నారు.