శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (20:53 IST)

వామ్మో యురేనియం... అది తవ్వితే ఏం జరుగుతుంది? తెలుసుకోవాల్సిందే...

యురేనియం ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది.

అవి యూ 238, యూ 235, యూ 234, యూ 235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2-4 పార్ట్‌ మిలియన్‌గా లభిస్తుంది.

భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో ఉన్నాయి. భారత్‌లోని ఈ ప్రాంతాలన్ని కూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇవి ఖనినజ నిక్షేపాలను తమ కడుపులో దాచుకున్నాయి. 

యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలు!
భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైనది. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75 శాతం అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్‌ రియాక్టర్లలో చర్య జరిగినపుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. 
 
అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యు-235 తక్కువ లో తక్కువగా 7కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు. యూరేనియం (యు- 238) నుంచి జనించే ఫ్లుటోనియం అనే రూపం (యు-239) అత్యంత ప్రమాదకరమైనది. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీనితో చాలా సులభంగా క్యాన్సర్‌ వ్యాధి వ్యాపిస్తుంది. 

 
భూమిలో నుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌‌తో చనిపోతారు.

కొన్ని వందల తరాలు వికృత సంతానం లేదా పూర్తిగా సంతాన లేమితో మానసిక వ్యధకు గురియ్యే ప్రమాదం ఉంది. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్‌ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
పర్యావరణం పై ప్రభావం!
యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
 
భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేర్లలో నిక్షిప్తమౌతాయి. యురేనియం తవ్వకాల కోసం 1000 అడుగుల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 అడుగుల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. 
 
ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్‌ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది.

అందువల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుంది.ప్రస్తుతం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం అనుమతించింది. ఈ యూరేనియం త్రవ్వకాలు జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభావం చూపనున్నది.