శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: బుధవారం, 20 జూన్ 2018 (17:45 IST)

చంద్రబాబులో తెలియని అసహనం.. ఎందుకో?

తమ సమస్యలు పరిష్కరించమంటూ తనను కలిసిన క్షురకుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. వీధుల్లో రెండు గ్రూపులు గొడవపడేటప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటారో… అచ్చం అలాగే ముఖ్యమంత్రి మాట్లాడారన్న విమర్శలు వస్తున్నాయి. ము

తమ సమస్యలు పరిష్కరించమంటూ తనను కలిసిన క్షురకుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. వీధుల్లో రెండు గ్రూపులు గొడవపడేటప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటారో… అచ్చం అలాగే ముఖ్యమంత్రి మాట్లాడారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి తన గోడును చెప్పుకోడానికి వచ్చిన క్షురకులను భద్రతా సిబ్బంది నియంత్రిస్తుండగా.. వాళ్లను వదలండి… ఏం చేస్తారో చూస్తాను’ అని వ్యాఖ్యానించారు.
 
‘కనీస వేతనాలు ఇవ్వం… మీ వల్ల అయింది చేసుకోండి అంటూ వేలు చూపిస్తూ క్షురకుల మీది మీదికీ వెళ్లారు. ఒక దశలో చెయ్యి చేసుకుంటారేమో అనేంతగా ఊగిపోయారు. గతంలో కర్నూలులో ఏదో సమస్యలపై అడిగితే… నేను వేసిన రోడ్డుపై నడుస్తూ, నేను ఇచ్చే పింఛను తీసుకుంటూ… టిడిపికి ఓటు వేయరా… అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతమూ ఇప్పుడు గుర్తుకొస్తోంది. ముఖ్యమంత్రిలో ఇంత అసహనం ఎందుకొస్తోంది..?
 
ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. చంద్రబాబు ప్రభుత్వం కూడా ‘ప్రజలే ముందు…’ అనే నినాదం కూడా ఇస్తోంది. నాయీ బ్రాహ్మణులు అడిగిన దాంట్లో తప్పేముంది? తమకు వేతనాలు పెంచమని కోరారు. తెలుగుదేశం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఆ మానిఫెస్టో ప్రకారం… తలనీలాల ద్వారా వచ్చే ఆదాయంలో క్షురకులకు వాటా ఇవ్వాలి. అలా ఇవ్వాల్సివస్తే చాలానే ఇవ్వాలి. అదికూడా అడగడం లేదు. తమను ఉద్యోగులుగా గుర్తించమని అడిగారు. కనీస వేతనాలు ఇవ్వమని అడిగారు. ఇందులో తప్పేముంది? అని అంటున్నారు. కనీసం తర్వాత పరిశీలిద్దాం అని అంటే సరిపోయేది కదా అని చెపుతున్నారు.
 
రాజకీయంగా, ప్రభుత్వపరంగా ఎదురువుతున్న వైఫల్యాలు ఆయన్ను కుంగదీస్తున్నట్లున్నాయి. బిజెపితో బంధాలు తెగిపోయిన తరువాత ఆందోళన మరీ ఎక్కువయింది. తనకు ఏదో కీడు జరగబోతోందని పదేపదే చెబుతున్నారు. ఏదైనా జరిగితే తనకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే…. అసహనం వస్తోంది. ఆ కోపం ఇలా చూపుతున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. ఇలాగే వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.