గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 19 నవంబరు 2020 (23:16 IST)

జనసేనానిని బిజెపి దూరం పెడుతోందా, ఎందుకు?

తెలంగాణా ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. అది కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యే పదవి. అది కాస్త తెలంగాణాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక సాధారణ జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలవడం గెలుపొందడం జరిగింది. ఆయనే రఘునందన్ రావు. దీంతో బిజెపి నేతల్లో మరింత పట్టు వచ్చినట్లయ్యింది. 
 
బిజెపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేస్తామంటూ బిజెపి ఎంతో నమ్మకంతోను, ధీమాతోను ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల జరుగబోతోంది. ఆ ఎన్నికల్లో బిజెపి నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించేసుకున్నారు. ఎపిలో బిజెపి.. జనసేన రెండు పార్టీలు కలిసి ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే.
 
అయితే జనసేనానిని ఏ మాత్రం సంప్రదించకుండా ఆయనతో చర్చించకుండా బిజెపి అభ్యర్థిని వెతుక్కుంటుండడం ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చకు కారణమవుతోంది. ఎంపిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ మరణం తరువాత జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి టిడిపి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. ఇక వైసిపి అభ్యర్థి కోసం వెతుకుతోంది. 
 
కానీ బిజెపి నేతలు మాత్రం ఒకడుగు ముందుకు వేసి తిరుపతిలో పార్టీ మీటింగ్‌లు పెట్టేయడం.. బిజెపి జెండాను ఎగురవేయడానికి అందరూ సహకరించమని కోరుతున్నారు. ఇది ఏమాత్రం జనసేన పార్టీ నాయకులకు నచ్చడం లేదు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోను జనసేన పోటీ చేస్తుందని చెప్పడం.. పవన్ కళ్యాణ్ బిజెపిని సంప్రదించకుండా అభ్యర్థులను చూసేసుకోవడం జరుగుతోంది. 
 
పొత్తులన్న తరువాత సీట్ల సర్దుబాటు ఉండాలి.. కానీ అది ఇక్కడ కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ను పూర్తిగా దూరం పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. బిజెపికి బలం ఉంది కాబట్టి ఇక జనసేనానితో అవసరం లేదని బిజెపి అగ్రనాయకులు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి.. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కొనసాగుతుందా.. లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందో?