గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (19:40 IST)

యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్... అయోధ్యలో రామాలయం నిర్మించేందుకేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 312 అసెంబ్లీ సీట్లు సాధించి అపూర్వ విజయాన్ని చవిచూసింది భాజపా. ఐతే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని మాత్రం ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ఫలితం అంతా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 312 అసెంబ్లీ సీట్లు సాధించి అపూర్వ విజయాన్ని చవిచూసింది భాజపా. ఐతే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని మాత్రం ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ఫలితం అంతా మోదీ మానియాలా సాగిందనే చెప్పాలి. ఫలితాలు వెల్లడయిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, మనోజ్ సిన్హా, సంతోష్ గంగ్వార్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ ఆదిత్యనాథ్ పేర్లు బలంగా వినిపించాయి. ఐతే వీరందరిలో చివరి ఆప్షన్ గా వినిపించిన యోగి ఆదిత్యనాథ్‌నే సీఎం పీఠం వరించింది. రేపు సాయంత్రం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.
 
అసలింతకీ ఎవరీ ఆదిత్యనాథ్... కాస్త తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి ఆదిత్యనాథ్ 1998 నుంచి వరుసగా ఎంపీగా విజయం సాధిస్తూనే వున్నారు. 12వ లోక్ సభలో ఆయన అతి పిన్నవయస్కుడుగా వున్న ఎంపీ. ఆ సమయంలో ఆయన వయసు 26 ఏళ్లే. ఐదుసార్లు వరుసగా ఎంపీగా విజయం సాధించిన ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో కూడా నిలిచేవారు. 
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్యటనలో నరేంద్ర మోదీ తర్వాత జనంలో అత్యధికంగా పర్యటించిన నాయకుడు ఆదిత్యనాథ్. ఇకపోతే 2002లో ఆయన హిందూ యువజనవాహిని స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా 90కి పైగా కేంద్రాలను నెలకొల్పారు. ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్ట్. ఆయన బీఎస్ డిగ్రీ చేశారు. ఆదిత్యనాథ్ ప్రసంగిస్తే, ఆ ప్రసంగానికి జనం మంత్రముగ్ధులైపోవాల్సిందే.
 
ఇకపోతే ఆదిత్యనాథ్ ఎంపికతో అయోధ్యలో రామాలయం నిర్మిస్తారన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ పైన సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టబోయే ఆదిత్యనాథ్ జనరంజక పాలన అందిస్తారని నమ్మేవారూ వున్నారు. యూపీ ప్రజలు భాజపాకు పట్టం కట్టారు కనుక భాజపా తరపున ఐదేళ్లుగా ఎంపీగా విజయం సాధిస్తున్న యోగీ ఆదిత్యనాథ్‌ను ఈ పీఠం వరించింది. మరి పీఠం ఎక్కాక ఆదిత్యనాథ్ ఎలాంటి పాలన అందిస్తారో వేచి చూడాల్సి వుంది.