శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (19:52 IST)

దీపావళి పండుగ ఎలా వచ్చిందో తెలుసా..?

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు.
  
 
పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షసలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. 
 
ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి, కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. 
 
జనకమహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ చక్కగా పూజచేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరిని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.   
 
ద్వాపరయుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువంటాడు. ఈ ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు.
 
ఆ విధంగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను, దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని సంహరించమని ప్రార్థిస్తారు. 
 
అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు. 
 
అక్కడ శ్రీ కృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుధ్ధము జరుగుతుంది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుధ్ధమధ్యలో మూర్చపోయినట్లు నటిస్తాడు. కళ్ళముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణం వేస్తుంది. 
 
అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు. బంధింప బడిన రాకుమార్తెలు మమ్ములనందరిని నీవే వివాహమాడమని ప్రార్ధిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు.
 
ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజునా నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు, అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు.