శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By Selvi
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (20:23 IST)

దీపావళి నాడు ఆకుపచ్చని రంగు, కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని పూజించాలా?

దీపావళి నాడు ఆకుపచ్చని రంగు, కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. అందుచేత దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి... దైవమూర్తుల పటాలకు గంధము, కుంకుమలతో అలంకరించాలి.
 
ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీ లక్ష్మీదేవీ పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులతో లక్ష్మీదేవి అర్చించాలి.
 
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
 
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసురుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలంటున్నారు.