గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : సోమవారం, 3 నవంబరు 2014 (16:41 IST)

కార్తీక పౌర్ణమి: జ్వాలాతోరణోత్సవంతో దోషాలు పరార్!!

కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి శివకేశవులను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ మాసంలో చేసే పూజలు, అభిషేకాలకు విశేష ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే సేవల్లో 'జ్వాలాతోరణోత్సవం' మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. 
 
జ్వాలాతోరణోత్సవం ... త్రిపురాసుల సంహారంతో ముడిపడినదిగా చెప్పబడుతోంది. వరగర్వితులైన త్రిపురాసురులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సాధుసజ్జనులను అనేక విధాలుగా హింసించసాగారు. త్రిపురాసురుల ఆగడాలు తెలుసుకున్న పరమశివుడు, లోకకల్యాణం కోసం వాళ్లను సంహరించడానికి రంగంలోకి దిగుతాడు.
 
అలా ఆయన త్రిపురాసురులను సంహరించినది కార్తీక పౌర్ణమి రోజునే. అందుకే దీనిని 'త్రిపుర పౌర్ణమి'గా కూడా పిలుస్తుంటారు. సాధారణంగా ఏదైనా విజయాన్ని సాధించినవాళ్లు అనేకమంది దృష్టిని ఆకర్షిస్తుంటారు. అందువలన వాళ్లకి దిష్టి తగులుతుంటుంది. ఈ కారణంగానే వాళ్లు ఇంటికి తిరిగిరాగానే దిష్టి తీయడం జరుగుతూ ఉంటుంది.
 
అలా త్రిపురాసురులను సంహరించి విజయంతో తిరిగివచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు.
 
కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.