శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (15:57 IST)

బంగారం ధరలు ఆకాశానికే... మహిళలు రూ.5000 ఓవర్‌డ్రాఫ్ట్ ఇందుకే ఉపయోగించాలేమో?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని తాయిలాలు, మరికొన్ని వాతలు కనబడుతున్నాయి. మధ్య తరగతికి మేలు చేకూర్చుతున్నాం అంటూనే బంగారం, పెట్రోల్, డీజిల్ విషయంలో వడ్డింపులు భారీగా వేశారు. బంగారం దిగుమతిపై ఏకంగా సుంకాన్ని 2.5 శాతానికి పెంచడంతో అది కాస్తా 12.5 శాతానికి పెరిగింది.
 
ఐతే భారతదేశ మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలకి ప్రాధాన్యతనిస్తారు. ఈ నేపధ్యంలో బంగారం కొనాలంటే మాత్రం వారు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. కానీ వేడుకలకు బంగారం కొనకుండా మహిళలు వుండరు గాక వుండరు. కాబట్టి అప్పోసొప్పో చేసైనా కొనాల్సిన పరిస్థితి. 
 
అందుకేనేమో కేంద్రం వారి కోసమే.. అంటే డ్వాక్రా మహిళల కోసమే ముద్రా పథకం కింద రూ.1,00,000 రుణాన్ని ఇస్తామంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదీ చాలకపోతే బ్యాంకు ఖాతాల్లో మహిళలకి రూ.5000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ప్రకటించారు కాబట్టి దాన్ని కూడా బంగారం కొనేందుకు ఉపయోగించుకోవచ్చనే సైటైర్లు వేస్తున్నారు. ఎటొచ్చీ అక్కడ కొట్టి ఇక్కడ తీసుకుంటున్నట్లుంది కేంద్ర బడ్జెట్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
ఇక పెట్రోల్, డీజీల్‌ విషయంలోనూ లీటరకు అదనంగా రూ.1 భారం వేశారు. ఇది మామూలు విషయం కాదు. సామాన్య ప్రజల నడ్డి విరిచేదే. ఈ భారం అనేక రూపాల్లో వారిని తాకుతుంది. ఇలా మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తున్నట్లే నడ్డి విరగ్గొట్టారంటున్నారు విశ్లేషకులు. మరి ఈ బడ్జెట్ పూర్తి ప్రభావం ఎలా వుంటుందో చూడాల్సిందే.