శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (05:40 IST)

గ్యాస్ సబ్సిడీ వదులుకోరా.. మేం వదిలిస్తాం అంటున్న కేంద్రం

మీ సంవత్సర ఆదాయం పది లక్షలు దాటినా స్వచ్చందంగా మీరు గ్యాస్ సబ్సిడీని వదులుకోకపోతే ఇకపై ఆ కష్టాన్ని మీమీద పెట్టకుండా ప్రభుత్వమే మీ గ్యాస్ సబ్సిడీని లాగేసుకోవడానికి పథకం వేసింది. దీంట్లో భాగమే ఆధార్ నిబంధన.

ఇన్నాళ్లుగా గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలా వద్దా అనే విషయాన్ని దేశ ప్రజల ఇచ్చకు వదిలేసిన కేంద్రం వినియోగదారుల తాట తీయడానికి నేరుగా రంగంలో దిగనుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆధార్ నెంబర్‌ తప్పనిసరిగా తెలపాలంటూ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన లక్ష్యం ఏమిటని గుంజాటన పడిన వారికి అసలు విషయం ఇప్పుడు తెలుస్తోంది. మీ సంవత్సర ఆదాయం పది లక్షలు దాటినా స్వచ్చందంగా మీరు గ్యాస్ సబ్సిడీని వదులుకోకపోతే ఇకపై ఆ కష్టాన్ని మీమీద పెట్టకుండా ప్రభుత్వమే మీ గ్యాస్ సబ్సిడీని లాగేసుకోవడానికి పథకం వేసింది. దీంట్లో భాగమే ఆధార్ నిబంధన.
 
ప్రభుత్వం సూచన ప్రకారం, గ్యాస్ కంపెనీల అభ్యర్థన ప్రకారం దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌ వినియోగదారులు మూడేళ్ల క్రితం నుంచి తమ ఆధార్‌ నెంబర్‌ను, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేస్తూ వంట గ్యాస్‌ మార్కెటింగ్‌ సంస్థల వద్ద నమోదు చేసుకోవడం మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్‌ సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. అయితే ఉద్యోగులు, వ్యాపారుల వార్షిక రాబడి వివరాలను ట్రాక్‌ చేసే వెసులుబాటు లేని కారణంగా, 10 లక్షల రూపాయల వార్షికాదాయం దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీని తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచన పెద్దగా కార్యరూపం దాల్చడం లేదు.
 
ఇప్పుడు ఐటి రిటర్న్స్‌‌లో విధిగా ఆధార్‌ సంఖ్య తెలియజేయాలన్న నిబంధన వల్ల ప్రభుత్వం పని సులభం అవుతుంది. నిర్దేశిత వార్షికాదాయ పరిమితిని దాటిన వారిలో ఎందరు వంట గ్యాస్‌ సబ్సిడీని వినియోగించుకుంటున్నారో ఆధార్‌ నంబర్‌ను బట్టి ప్రభుత్వం అలవోకగా ట్రాక్‌ చేయగలుగుతుంది. దీనిని బట్టి వంటగ్యాస్‌ సబ్సిడీలపై వేటుకు అవకాశం ఉంటుంది. వంట గ్యాస్‌ సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందిగా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఆరులక్షల మంది మాత్రమే వంట గ్యాస్‌ సబ్సిడీని వదులుకోవడంతో ఇలా కాదని కేంద్రం ఆధార్ కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతోంది. 
 
ఐటి రిటర్న్స్‌లోని ఆధార్‌ నంబర్‌ సహాయంతో రేషన్‌ దుకాణాల ద్వారా సబ్సిడీలను వినియోగించుకుంటున్న వారికి కూడా ప్రభుత్వం చెక్‌ పెట్టనున్నట్టు చెబుతున్నారు.