శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (17:04 IST)

అంతుపట్టని నొప్పులా... పెయిన్‌ 'కిల్ల'ర్స్ వాడుతున్నారా.. జాగ్రత్త...!

మానవ శరీరానికి ఏర్పడే సమస్యలు నొప్పి రూపంలో కనిపిస్తాయి. ఈ నొప్పులను రెండు రకాలుగా  చెప్పుకోవచ్చు. ఒకటి సమస్యతో ఏర్పడే నొప్పులు, సమస్య లేకుండానే ఏర్పడే నొప్పులు. సమస్య వలన ఏర్పడే నొప్పులను నోసిసెప్టివ్ పెయిన్స్ అని,  ఎటువంటి సమస్య లేనప్పటికీ కనిపించే నొప్పులను న్యూరోపతి పెయిన్స్ అని అంటాము.
 
శరీరంలో ఏర్పడిన సమస్య తగిన మందులు వాడితే నోసిసెప్టివ్ నొప్పులు తొలగిపోతాయి. ఇప్పుడు సమస్యంతా న్యూరోపతి పెయిన్స్‌తోనే ఎందుకంటే ఈ రకం నొప్పులకు కారణాలు ఉండవు. నరాలలో ఏర్పడే లోపాల వలన, అసాధారణ మార్పుల వలన ఈ రకం నొప్పులు ఏర్పడతాయి. వీటికి పెయిన్‌ కిల్లర్స్ వాడితే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా మళ్లీ యదాతథంగా నొప్పు ఏర్పడుతుంది.
 
తద్వారా కొందరు ఈ నొప్పులకు పెయిన్ కిల్లర్స్‌ను తరచూ వాడుతూ వాటికి అలవాటు పడి, మరిన్ని సమస్యలను తెచ్చుకుంటారు. ఈ విధమైన కారణాలు తెలియని నొప్పు ఏర్పడే వారిలో కొంత మందికి పాదాల నుంచి పైకి పాకుతూ తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. దీన్ని ప్లాంటా ఫేషియైటిస్ అంటారు. ఇటువంటి నొప్పులకు కారణాలు తెలియవు. ప్రత్యేక చికిత్సలు కూడా ఉండవు.
 
కొంత మందిలో చివరి వెన్నుపూస దగ్గర నొప్పి ఏర్పడుతుంది. ఏ మాత్రం చిన్న దెబ్బతగిలినా, ఒత్తిడి ఏర్పడినా వారు నొప్పిని భరించలేరు. ఈ బాధను తట్టుకోవడానికి పెయిన్ కిల్లర్‌కు అలవాటు పడతారు. 
 
క్యాన్సర్ బాధితుల్లో నొప్పి భరించరానిదిగా ఉంటుంది. కణితిని తీసివేసినా నొప్పి తగ్గదు. ఇలాంటి వారు నిరంతరం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వాటికి అలవాటుపడతారు. ఇటువంటి విచిత్రమైన నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్ వాడితే అవి అలర్జిక్ రియాక్షన్‌ ఏర్పడవచ్చు.  తద్వారా శరీరం అంతటా బొబ్బలు వచ్చి, శ్వాస పీల్చుకోవడం కష్టమై ఒక్కో సారి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. కేవలం ఒకే ఒక్క మాత్రతో కడుపులో  తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 
పెయిన్ కిల్లర్స్ :
 
శరీరంలో ఏర్పడే నొప్పులకు పెయిన్ కిల్లర్స్ శరీర స్థితికి శరీరానికి సరిపడతాయో లేదో తెలుసుకుని వాడాలి. ఎందుకంటే ఓపియాడ్స్, నార్కోటిక్స్,  మార్ఫిన్, కోడిన్, ఆక్సికోడా వంటిని పెయిన్ కిల్లర్స్ నల్లమందుతో తయారు చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాస్తవానికి హానికరమైనవే. కానీ,  క్యాన్సర్ కారణంగా నొప్పి భరించలేనంత ఉన్నప్పుడు వీటిని ఇస్తారు. మెదడులో సహజనంగా ఉత్పన్నమయ్యే ఓపియాడ్‌తో ఉపశమనం రానప్పుడే ఈ మాత్రలు అవసరమవుతాయి. అయితే ఈ విషయం తెలియక కొందరు ఇటువంటి పెయిన్‌ కిల్లర్స్‌ను తీసుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. 
 
ఈ మందులను వాడే రోగి నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతాడు. దీంతో మళ్లీ నొప్పి వచ్చినప్పుడు ఈ మాత్రలనే వేసుకోవడం ద్వారా అది వారికి వ్యసనంగా మారుతుంది. ఈ విధంగా అలవాటు పడిన వారు తప్పక వైద్యుల ఆశ్రయించడం అవసరం. ఇటువంటి ప్రాణహాని గల పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడిన వారు వైద్యుల సూచనలను పాటించి, ఒకే సారి కాకుండా క్రమంగా తగ్గిస్తూ ఒక దశలో వీటిని పూర్తిగా మానిపించవచ్చునని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కనుక పెయిన్‌ కిల్లర్స్‌ను వైద్యుల సూచన మేరకే వాడడం ఉత్తమం.