శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (16:34 IST)

పోషక పదార్థాల ప్రతిరూపం చెర్రీ రసం

చెర్రీ రసం... మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు కలిగిన వారికి ప్రమాదం కావచ్చు కానీ ఇతరులకు అమృతంతో సమానమని బ్రిటన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పావు లీటరు పరిమాణం ఉండే గ్లాసు చెర్రీ రసంలో ఇతర పండ్లు, కూరగాయలలో కంటే 23 రెట్లు అధికంగా పోషక పదార్థాలున్నట్లు నిర్ధారించారు. 
 
బఠాణీలు, టొమోటోలు, దర్భూజ, క్యారెట్లు, అరటిపండ్లతో పోలిస్తే చెర్రీ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఐదు రెట్లు అధికంగా ఉంటాయని వెల్లడైంది. కేన్సర్, గుండెజబ్బులు, వృద్ధాప్యం తదితర సమస్యలకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను ఈ యాంటీ యాక్సిడెంట్లు సమర్థంగా నిరోధించగలవని వారు చెపుతున్నారు. 
 
కూరగాయలు, పండ్లలో ఫ్రీరాడికల్స్ నివారణ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు జరిపిన పోషకాహార నిపుణుడు డాక్టర్ రాబర్ట్ వెర్క్‌ర్క్ చెర్రీలలో ఈ శక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన తన పరిశోధన వివరాలను "న్యూట్రిషనల్ ప్రాక్టీషనర్" పత్రికలో ప్రచురించారు.
 
అన్నిరకాల చెర్రీ పండ్లలోనూ... యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఒకే రీతిగా ఉండదని, ముఖ్యంగా అమెరికాలో పండే మాంట్‌మరెన్సీ రకం చెర్రీల్లో ఇవి అత్యధికంగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
 
అందువల్ల షుగర్, అధిక బరువు ఉన్న రోగులను మినహాయిస్తే ప్రతి ఒక్కరూ చెర్రీ పండ్ల రసాన్ని సేవించవచ్చు. వ్యర్థ శీతల పానీయాలను తాగడం కంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను సులువుగా అందిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు.