శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (09:24 IST)

కీళ్ల నొప్పులకు ఆవనూనెతో చెక్ పెట్టండి

సాధారణంగా అనేక మందికి వయస్సు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగానీ, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్లగానీ కీళ్ళ వ్యాధి రాగల అవకాశముంది.
 
ఈ నొప్పులు వచ్చే ముందు.. కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు నొప్పి ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ నొప్పులతో బాధపడే వారు నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరంలాంటి లక్షణాలతో బాధపడుతుంటారు. 
 
ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను  తీసుకునిప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరగకాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 
 
ఇలా మర్దన చేయడం వల్ల కొందరికి కీళ్ళ నొప్పులు తగ్గకుండా నొక్కడం వల్ల ఇంకా బాధ పెరుగుతుంది. ఇటువంటి వారు నూనెను రాసుకుని కాపడం పెడితే చాలు. కీళ్ళు స్వాధీనంలోకి వచ్చాక మర్దన చేసుకోవచ్చు. జీల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.