ముందు జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ నివారణ సులభం!!
క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గురువారం ఐఎంఏ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ కారణంగా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సులభ సాధ్యమవుతుందని చెప్పారు.
ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. ప్రజలలో కొంత అవగాహన ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పుకొచ్చారు.
క్యాన్సర్లో ఉన్న రకాలను వివరించారు. క్యాన్సర్ వ్యాధి ఉన్న వారికి కత్తి వాడకూడదనే అపోహ ప్రజలలో ఉందని, కానీ ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే క్యాన్సర్ను చాలావరకు జయించవచ్చన్నారు.