గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2015 (10:14 IST)

నేడు ఎయిడ్స్ డే.. తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల మంది వ్యాధిగ్రస్తులు

ఎయిడ్స్... ప్రపంచ మానవాళిలో పెనువిషాదాన్నీ, విలయ విధ్వంసాన్నీ సృష్టించింది, సృష్టిస్తోంది. 1981 జూన్‌లో అమెరికాలో ఎయిడ్స్ వ్యాధి వెలుగు చూసింది. గడచిన 34 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మందికిపైగా ఎయిడ్స్ వ్యాధిని కల గజేసే హెచ్‌ఐవీ క్రిమిసోకింది. నాలుగు కోట్లకు మించి వ్యాధిగ్రస్తులను బలితీసుకొంది. 2015 జూన్ అంచనాల ప్రకారం 3 కోట్ల 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధలు పడుతున్నారు. అందుకే ప్రతి యేడాది 
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. 
 
ఈ సందర్భంగా ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారత్‌లో 2011 డిసెంబర్‌కు 24 లక్షల మంది, 2013 చివరి నాటికి 21 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు మన ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్’కు సమర్పించిన నివేదికలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు నమోదైంది. తెలుగు జనాభా దేశంలో దాదాపు 6 శాతం అయితే, భారత్‌లోని హెచ్‌ఐవీ రోగుల్లో 20 శాతంపైగా తెలుగువారున్నారు.
 
ఇదిలావుండగా, చైనాలో అధిక సంఖ్యలో 5లక్షల 75 వేల మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో సహజీవనం చేస్తున్నారని చైనీస్ హెల్త్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చైనా ఎయిడ్స్ కేసుల వివరాలను వెల్లడించింది. 
 
ఈ యేడాది అక్టోబర్ ముగిసే నాటికి ఎయిడ్స్ బారినపడిన వారిలో 1.77 లక్షల మంది చనిపోయినట్టు తెలిపింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు చైనాలో ప్రతీ 10 వేల మందిలో ఆరుగురు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బారిన పడ్డారని చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల్లో వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఎక్కువగా లైంగిక సంబంధాల వలన నమోదైన కేసులేనని స్పష్టం చేసింది.