గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (19:00 IST)

ఇన్సులినోమా ట్యూమర్‌ను తొలగించిన మెడ్‌వే మెడికల్ సెంటర్

చెన్నై, కోడంబాక్కంలోని మెడ్‌వే మెడికల్ సెంటర్ 23 యేళ్ల యువకుడి శరీరంలో ఉన్న ఇన్సులినోమా ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించింది. ఈ ట్యూమర్ తొలగించేందుకు చేసిన ఆపరేషన్ అరుదైన శస్త్రచికిత్సగా ఆస్పత్రి సీఈఓ డాక్టర్ పళనియప్పన్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్, హల్దియా ప్రాంతానికి చెందిన 23 యేళ్ళ మనాస్ మన్నా అనే యువకుడు ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకిచేరుకుని కిందపడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి కోలుకోవడం, ఎప్పటిలా ఆహారం తీసుకోవడం జరుగుతుండేదని చెప్పారు. పైగా అపస్మారకస్థితికి చేరుకున్న తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి మామూలు స్థితికి చేరుకునేవారని చెప్పారు. దీంతో ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఏ ఒక్క వైద్యుడు నిర్ధిష్టమైన అవగాహనకు రాలేక పోయారన్నారు. చెన్నైలోని అనేక ఆస్పత్రుల్లో కూడా చికిత్స చేసుకున్నప్పటికీ.. యువకుడి పరిస్థితిలో ఎలాంటి మార్పులేదన్నారు.
 
ఈ నేపథ్యంలో తమను సంప్రదించగా, తాము ఆ యువకుడికి నిశితంగా వైద్య పరీక్షలు చేసి, అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. తమ పరిశీలనలో.. అపస్మారకస్థితిలోకి వెళ్లినపుడు షుగర్ లెవెల్స్ తనిఖీ చేయగా, చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. శరీరంలో ఉన్న ఇన్సులినోమా ట్యూమర్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితి పది లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తుందన్నారు. అందుకే దీన్ని అత్యంత అరుదైన ట్యూమర్‌గా పేర్కొంటారని, దీన్ని తొలిసారి అమెరికాలో గుర్తించినట్టు తెలిపారు. 
 
ఈ తరహా ఆపరేషన్‌ చేసేందుకు ఖర్చు అమెరికాలో అయితే రూ.15 లక్షల వరకు అవుతుందన్నారు. అదే భారత్‌లో అయితే రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు అవుతుందన్నారు. కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు డాక్టర్ పళనియప్పన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ యువకుడి ఆరోగ్యం బాగా ఉన్నట్టు తమ పరిశీలనలో తెలిపారు. ఈ ఆపరేషన్‌కు ఆరు గంటల సమయం పట్టిందన్నారు. కాగా, ఈ ఆపరేషన్‌ను తనతో పాటు డాక్టర్ దళపతి, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ షణ్ముగ సుందరం, డాక్టర్ ప్రీతిలతో కూడిన వైద్య బృందం చేసినట్టు తెలిపారు.