గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (12:48 IST)

భారత్‌లో విడాకుల కేసులు రెట్టింపు: ఊహా ప్రపంచంలో విహరిస్తూ..?

భారత్‌లో విడాకుల కేసులు రెట్టింపు అవుతున్నట్లు ఓ స్వచ్ఛంధ సంస్థ సర్వేలో తేలింది. పదేళ్లతో పోలిస్తే భారత్‌లో విడాకుల సంఖ్య డబుల్ అయ్యిందని సర్వే తేల్చింది. సగటున వెయ్యి పెళ్లిళ్లలో పదమూడు విఫలమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య మరి కాస్త ఎక్కువ. దేశ వ్యాప్తంగా విడాకుల కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో మొదట ఢిల్లీ, ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్‌ ఉన్నాయి. 
 
ఒక్క రంగారెడ్డి కుటుంబ న్యాయస్థానంలోనే ఏడాదికి 2,500 కేసులు నమోదవుతున్నాయంటే యువతరంలో ఈ బంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతుంది. హైదరాబాద్‌లో ఉన్న నాలుగు కుటుంబ న్యాయస్థానాల్లోనూ కలిపి రోజుకు 30 విడాకుల కేసులు ఫైల్‌ అవుతున్నాయని న్యాయవాది అనూరాధ అంటున్నారు. విడాకుల కేసుల నమోదులో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న బెంగళూరులో ప్రస్తుతమున్న మూడు కుటుంబ న్యాయస్థానాలను ఆరుకు పెంచాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. 
 
విడాకులకు అప్లై చేసే వారిలో 80 శాతం మంది 25 నుండి 39 ఏళ్లలోపు వారు. వీరిలో 75 శాతం మంది సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్స్‌ వంటి రంగాలకు చెందిన ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న దంపతులే ఎక్కువగా విడాకుల వరకూ వెళుతున్నట్లు సర్వే తేల్చింది. 
 
రానురాను విడాకుల కేసులు పెరగడంతో కేవలం ఐటీ సెక్టార్‌ వాళ్ల కోసమే ఆది వారాలు, రెండో శనివారాలు కూడా కుటుంబ న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే రోజుకు 30 విడాకుల కేసులు నమోదవుతున్నాయని సర్వేలో వెల్లడైంది. 
 
ఇంతకీ విడాకులకు దారితీసే కారణాలేంటని ఆరాతీస్తే..?
వాస్తవాలకు దూరంగా ఆలోచించడం. ఊహా ప్రపంచంలో విహరించడం వల్ల ఇద్దరి ఆలోచనల మధ్య ఎక్కువ వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి. ఆలుమగలిద్దరూ అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని పొందలేక...ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవడం చేతకాక... బయటి ఆకర్షణకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో బయటి ఆకర్షణ సమస్య పెరిగిందని కుటుంబ న్యాయ సలహాదారులు అంటున్నారు. 
 
ఇకపోతే, మహిళలు ఉద్యోగం చేయడం.. విడాకులైనా.. భర్త నుంచి మనోవర్తి వంటివి కోరడం లేదు. పిల్లల పెంపకం కోసం కూడా భర్త నుంచి డబ్బు పొందేందుకు ఇష్టపడట్లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లే ఎక్కువగా విఫలమవుతున్నాయి. కారణం... అమ్మాయి, అబ్బాయి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలకన్నా ఆర్థిక స్థిరత్వం, కుటుంబహోదా మొదలైనవాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 
ఇంకా మ్యారేజ్‌ బ్యూరోల ద్వారా జరిగిన వివాహాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదు అవుతున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. అలాగే బ్యూరోల ద్వారా జరిగే పెళ్లిళ్లలో చాలా వరకూ అబ్బాయిల చదువు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మోసాలుంటున్నాయని అంటున్నారు. 
 
అయితే విడిపోయాక కూడా వాళ్లు సంతోషంగా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఒంటరితనం... తప్పు చేశామనే భావన వారిలో రకరకాల మానసిక రుగ్మతలకు దారితీస్తోంది. అబ్బాయిలు ఎక్కువగా తాగుడు వంటి వ్యసనాల బారిన పడితే, అమ్మాయిలు మానసికంగా కృంగిపోతున్నట్లు చెబుతున్నారు మానసిక వైద్యులు. విడాకులతో ఎన్నో సమస్యలున్నాయని భార్యాభర్తలు అర్థం చేసుకోవట్లేదని, సర్దుబాటు అనేది లేకపోవడంతోనే విడాకుల కేసులు పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు.