జర్నీ హాయిగా ఉండాలంటే...! జాగ్రత్తలు తప్పవు...!
సాధారణంగానే బస్సు, రైలు వంటి ప్రయాణాలు కొందరికి అస్సలు పడవు. అటువంటి వారికి ప్రయాణ సమయంలో వాంతు రావడం, తల తిరగడం, వికారం వంటివి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
ప్రయాణానికి ముందు కడుపు నిండా తినడం సరికాదు. మరీ తప్పదు అనిపిస్తే ఘనాహారం కంటే పండ్ల రసాలూ, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. అవీ తియ్యగా ఉండేవే తీసుకోవాలి. పుల్లటి పానీయాలు తీసుకుంటే వికారానికి కారణవుతాయి. అలాగని ఖాళీ పొట్టతో కూడా వెళ్లడం మంచిది కాదు. వేపుళ్లూ, మసాలాలూ ప్రయాణ సమయంలో అస్సలు తాకరాదు. వాటికి బదులు ఉడికించినవీ, మిరియాల పొడి చల్లినవీ అయితే ఫర్వాలేదు. ఎలాంటి దుష్ర్పబావాలూ ఉండవు.
ప్రయాణం ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లైతే మాత్రం ముందు రోజు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. బాగా నిద్రపోవాలి. అలసటతో కూడిన ప్రయాణం అయితే మాత్రం శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతుంది.
ప్రయాణానికి ముందుగానీ, ప్రయాణ సమయంలోగానీ రెస్టారంట్లూ, రోడ్ సైడ్ ఆహార పదార్థాలను తినవద్దు. అవి పొట్టలో ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే తిని బయలుదేరడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రయాణం ప్రారంభం కాగానే పిప్పర్ మెంట్లు, ఉసిరి, నిమ్మ రుచి గల క్యాండీలూ.. నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే బాగుంటుంది. తద్వారా వాంతులు, వికారం దరిచేరవు. ప్రయాణానికి ముందు ఘాటైన పరిమళ ద్రవ్యాలూ, గాఢత ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లూ వాడకపోవడం మంచిది, వీటి వాడకం వల్ల వికారం కలిగే ప్రమాదం లేకపోలేదు.