తిరుమలలో సాధారణ భక్తులకు అందుబాటులో అర్చన టికెట్లు
తిరుమలలో ఏదోక సేవ లభిస్తేచాలు అనుకునే భక్తులు చాలా మంది ఉన్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యలో కరెంటు బుకింగ్ కింద కొన్ని సేవల టికెట్లను అందుబాటులోకి తెస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి బుధవారం నిర్వహించే అర్చన సేవా టికెట్లను టిటిడి మంగళవారం జారీ చేయనుంది. శ్రీవారికి రేపు తెల్లవారుజామున నిర్వహించనున్న సేవకు సంబందించి టికెట్లను భక్తులకు కేటాయించనుంది.
బుధవారం జరిగే అర్చన టికెట్లు 19 అందుబాటులో ఉన్నాయి. సేవా టికెట్లను కోరుకునే భక్తులు తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సిఆర్ఓ) ఆవరణంలోని ఆర్జిత కౌంటర్లోకి వ్యక్తిగతంగా హాజరై వేలిముద్రను పొందుపరిచి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు అవకాశాన్ని టిటిడి భక్తులకు కల్పిస్తుంది.
అనంతరం ఎలక్ట్రానిక్ లాటరి పద్దతి ద్వారా అందుబాటులో ఉన్న టికెట్లను బట్టి భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీడిప్లో ఎంపికైన భక్తులు రాత్రి 8 గంటల లోపు టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.అర్చన టికెట్ ధర 220 రూపాయలుగా టిటిడి నిర్ణయించింది.