శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2015 (08:40 IST)

ఏప్రిల్ 1 నుంచి తిరుమలలో మహిళా క్షురుకులు.. బహుమానంగా రూ.400

తిరుమలలో ఏప్రిల్ ఒకటి నుంచి మహిళా క్షురక సేవకులు విధులకు హాజరుకానున్నారు. కళ్యాణకట్టలో తమ సేవలను అందజేయడానికి ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పరీక్షలను వారు ఎదుర్కొన్నారు. అందులో ఎంపికైన వారిని వచ్చేనెల నుంచి విధుల్లోకి తీసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి బహుమానం కూడా ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రస్తుతం కల్యాణకట్టల్లో పనిచేసే  280 మంది శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.30వేల దాకా జీతభత్యాలు వస్తున్నాయి. 300 మంది కాంట్రాక్టు కార్మికులు (పీసురేటు క్షురకులు)కు ఒక్కో గుండుకు రూ.7, కత్తిరింపులకు రూ.3 టీటీడీ అందజేస్తోంది. అయితే వచ్చే భక్తులు అధికం కావడంతో వారికి తలనీలాలు తీసుకోవడం క్షురకులకు తలకు మించిన భారం అవుతోంది. అందుకే టీటీడీ ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత సేవ చేసేందుకు ముందుకు వచ్చిన మహిళా క్షురకులను తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో చాలా మంది తిరుమలకు క్యూకట్టారు. వారికి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. 
 
ఉచిత సేవ చేసేవారు, వారిపై ఆధారపడ్డ కుటుంబాల జీవనం కోసం కాంట్రాక్టు కార్మికుల తరహాలోనే బహుమానం ఇవ్వడం సముచితమని టీటీడీ ఈవో సాంబశివరావు భావించారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి బహుమానం ఇవ్వాలని నిర్ణయించారు. కనీసం ఒక్కొక్కరికి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు బహుమానం ఇచ్చే విషయంపై లెక్కలు వేస్తున్నారు.