మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 20 జులై 2015 (06:21 IST)

తిరుమల దర్శనం పేరుతో ఆన్‌లైన్‌లో పక్కా మోసం..! నకిలీ టికెట్ల అమ్మకం.. !!

ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్యకాలంలో భక్తులకు మరింత సేవలు అందస్తోంది. ఆన్‌లైన్ టికెట్ల విధానంతో ఒకరిని అడుక్కోవాల్సిన పని లేకుండా స్వామిని దర్శించుకుని వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. అయితే కొన్ని వెబ్‌సైట్లు దీనిని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం నకిలీ టికెట్లతో తిరుమల చేరిన భక్తులతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 
 
‘టెంపుల్‌ యాత్రి డాట్‌ కామ్‌’ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగానే, శ్రీవారి దర్శన టికెట్‌ రూ.300, గదులతో కలిపి రూ.916 అని ధరలు ఉంటాయి. ఏ రోజు ఎప్పుడు టైమ్‌ స్లాట్‌ ఉంది, టికెట్ల వివరాలన్నీ అందులో ఉన్నాయి. టీటీడీ వెబ్‌సైట్‌లోని వివరాలన్నీ తన వెబ్‌సైట్‌లోనూ నమోదు చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. కానీ, శ్రీవారి దర్శన టికెట్లన్నీ టీటీడీ వెబ్‌సైట్‌లోనే కొనుగోలు చేయాలి. 
 
ఈ విషయం తెలియక పలువురు భక్తులు ‘టెంపుల్‌ యాత్రి’ వెబ్‌సైట్‌లోనూ కొని మోసపోతున్నారు. ఇలా, చెన్నైకు చెందిన మనోజ్‌ జోషి దంపతులు వసతితో కలిపి రెండు రూ.300 టికెట్లను రూ.1832 చెల్లించి కొనుగోలు చేశారు. తమకు ఇచ్చిన టైమ్‌ స్లాట్‌ ప్రకారం శ్రీవారి దర్శనానికి ఆదివారం తిరుమల వచ్చారు. క్యూలైన్‌లో టీటీడీ సిబ్బంది ఈ టికెట్లు నకిలీవని గుర్తించి వారిని వెనక్కి పంపేశారు. ఏం చేయాలో దిక్కుతోచక వీరు వెనుదిరిగారు. అదే సమయంలో రూ.300 టికెట్ల క్యూలైన్‌ను తనిఖీ చేస్తూ టీటీడీ ఈవో సాంబశివరావు అటుగా వచ్చారు. 
 
వీరు ఈవోను కలిసి తమ సమస్య చెప్పారు. దీంతో ‘టెంపుల్‌ యాత్రి’ వ్యవహారం వెలుగు చూసింది. మానవతా దృక్పథంతో ఆ భక్తులకు శ్రీవారి దర్శనం ఏర్పాటు చేయాలని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను ఈవో ఆదేశించారు. ‘టెంపుల్‌ యాత్రి’ వెబ్‌సైట్‌లో.. శ్రీవారి దర్శన టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌పై విచారించి చర్యలు తీసుకోవాలని అదనపు నిఘా, భద్రతా అధికారి శివకుమార్‌రెడ్డిని ఆదేశించారు. వెబ్‌సైట్‌ సృష్టికర్తపై సైబర్‌నేరం కింద కేసు నమోదుచేయాలని ఈవో సూచించారు.