మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2015 (14:58 IST)

1958లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1 లక్ష.. ఇప్పుడు రోజుకి రూ. 3 కోట్లు... అసలీ హుండీ ఏర్పాటు ఎప్పట్నుంచి...?

తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చే సమయంలో మరో భారీ క్యూ కనిపిస్తుంది. కొత్తవారికి, చిన్నపిల్లలకు ఈ క్యూ ఎందుకని అనుమానం కలుగుతుంది. అది కొప్పెర(హుండీ)కి వెళ్ళే క్యూ.రోజులో కొన్ని కోట్ల రూపాయలు అక్కడ పోగవుతుంది. అసలు ఈ కొప్పెరను ఎవరు ప్రవేశపెట్టారు? ఎందుకు ప్రవేశపెట్టారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. 
 
తిరుమలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి కానుకలు వస్తూనే ఉన్నాయి. స్వామి కైంకర్యాలు, ప్రసాదాలకు అవసరమైన అన్నింటిని ధనవంతులు, పాలకులు పేదలు వారి వారి ఆర్థిక స్థాయిని అనుసరించి కానుకలు వివిధ రూపాలలో ఇచ్చేవారు. దానితో ఆలయ కైంకర్యాలను చేసేవారు. ఇది ఆది నుంచి వస్తున్న చరిత్ర. అయితే కానుకలు, వితరణలు పెరిగాయి. దీంతో పాలకులు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. దీనికి కొప్పెర అని పేరుపెట్టారు. 
 
ఆదాయానికి ఒక లెక్కాపద్దు ఉండాలనే యోచనను తొలిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. 1821 జులై 25న హుండీని ఏర్పాటు చేశారు. ఒక గంగాళాన్ని తీసుకుని దాని చుట్టూ తెల్లటి వస్త్రాన్ని కప్పేసి పైకి కడతారు. దానికి వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే కాలక్రమేణా హుండీగా పరిగణలోకి వచ్చింది. ఎలా లెక్కించాలి. ఎలా కొప్పెరను దించాలనే అంశంపై ఓ ప్రత్యేక చట్టాన్నే ఏర్పాటు చేశారు. ఇది బ్రూస్ కోడ్ 12లో ఉంది. 
 
తొలిసారి 1958 నవంబర్ 28న లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో కోటి రూపాయలు దాటుతోంది. ఇక ప్రత్యేక పర్వ దినాలలో రూ. 3కోట్ల దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిని ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. రోజులో రెండు మార్లు కొప్పెరను ఏర్పాటు చేస్తారు. దీనిని లెక్కించడానికి ప్రత్యేక పరకామణి సిబ్బందే ఉందంటే ఆశ్చర్యపోనక్కర లేదు. వచ్చిన ఆదాయాన్ని భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టి బ్యాంకులలో జమ చేస్తారు. చిల్లరే కొన్ని కోట్లలలో ఇప్పటికీ మూలుగుతోంది.