గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ttdj
Last Modified: శనివారం, 28 జనవరి 2017 (18:24 IST)

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడో తెలుసా?

తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజినీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముని రక్ష

తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజినీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. 
 
మైరావణ వృత్తాంతం ఏం చెబుతుందంటే రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను చేజిక్కించుకునేందుకు రామారావణుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడి పోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. 
 
తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకపోతాడు మైరావణుడు.
 
హనుమంతుని పయనం... 
రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకర ధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారని, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకరపోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.
 
మైరావణుని సంహారం...
మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వముఖం ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు. అతనే పంచముఖాంజనేయుడు.
 
పంచముఖాల ప్రాశస్త్యం ఏంటంటే అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాగిస్తూ అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వ ముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి.