శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 9 మే 2015 (08:15 IST)

నేటి నుంచి శ్రీనివాస మంగాపురంలో వసంతోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 9 నుండి 11వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు అంటే మే 9, 10వ తేదీల్లో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు.
 
చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.
 
కాగా రెండో రోజు మే 10వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
 
గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.