గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PY REDDY
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (12:16 IST)

తిరుమలలో సుప్రభాత సేవ రద్దు.. ఎందుకు? దాని స్థానంలో ఏం చేస్తారు?

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని మేల్కోల్పడానికే  ఓ ప్రత్యేక సేవ ఉంది. అది ప్రపంచ సుప్రసిద్ధం. అదే సుప్రభాతం. సుప్రభాతం పాడనిదే వేంకటేశ్వర నిద్ర లేవడు. అలాంటి సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతానికి రద్దు చేసింది. దాదాపు నెల పాటు వేంకటేశ్వర స్వామి తనను స్తుతించే సుప్రభాతం వినకుండానే నిద్ర లేచి భక్తులకు దర్శనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? ఏమిటీ? 
 
తిరుమలలో వేంకటేశ్వర స్వామి కైంకర్యాల కోసం ఓ ప్రత్యేక నియమావళి ఉంది. ఆ నియమావళి మేరకే అర్చకులు నడుచుకోవలసి ఉంటుంది. ఆరునూరైనా.. ప్రపంచం తల్లికిందులైనా సరే దానిని ఉల్లంఘించడానికి లేదు. నేటి సాయంత్రం నుంచి ధనుర్మాసం రానున్నది. దీనిని సాధారణ భాషలో శూన్య మాసం అంటారు. ఈ శూన్యమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని మేలుకొల్పే సుప్రభాత సేవను రద్దు చేస్తారు. అంటే రేపటి వేకువ జాము నుంచి జనవరి 14 తేది వరకూ ఈ సేవ రద్దు అవుతుంది. ఈ నెల రోజులు కూడా వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ లేకుండా నిద్ర లేవాల్సి ఉంటుంది. మరి సుప్రభాత సేవ స్థానంలో ఏం చేస్తారు? సహజంగా ఇది అందరికీ కలిగే సందేహం.
 
వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వారిలో ఆళ్వార్లు ఒకరు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన అండాల్ గోదాదేవి విరచిత తిరుప్పావై ఏకాంత సేవ నిర్వహిస్తారు. అండాల్ గోదాదేవి రచించిన పాసురాలను సేకరించారు. వాటిలో నెల రోజుల పాటు రోజుకు ఒకటి చొప్పున 30 వాటిని ఆలపిస్తారు. ధనుర్మాస వ్రతం అనేది తమిళులకు అత్యంత ముఖ్యమైనది. అందరికీ శుభం కలగాలని పాసురాలతో తిరుప్పావై సేవను నిర్వహిస్తారు. అలా సుప్రభాత సేవ స్థానంలో మరో సేవ జరుగుతుంది.