గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 10 జులై 2015 (07:58 IST)

ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రసాదం..! తిరుపతి, బెంగళూరు కేంద్రంగా వ్యాపారం..!! ఇద్దరి అరెస్ట్

భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను ఓ ముఠా ఆన్‌లైన్ ప్రసాదంగా మార్చేసింది. అలా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇలా స్పీడ్ పోస్టులో కోరుకున్న చోటుకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను నెలకొల్పి మరి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పోలీసులు దీని గుట్టురట్టు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం గాజులమండ్యానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, అతడి స్నేహితుడు విజయ్‌ కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ఆన్‌లైన్‌ ప్రసాద్‌ డాట్‌ కామ్‌’ పేరిట వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి నగదు చెల్లించే వారికి స్పీడ్‌పోస్టు ద్వారా లడ్డూలు, చిత్రపటాలు పంపేవారు. ఆర్డర్లను వాళ్లు తీసుకుంటే.. లడ్డూలు పంపే పనిని తిరుపతిలోని అతని సోదరుడు ధనశేఖర్‌రెడ్డి చూసుకునేవాడు. 
 
రూ.501 చెల్లించిన వారికి రెండు లడ్డూలు, ఒక చిన్న ఫొటో; రూ.751 చెల్లిస్తే రెండు పెద్ద లడ్డూలు, ఒక పెద్ద ఫొటో; రూ.1501 చెల్లిస్తే మూడు నెలలపాటు నెలకు రెండు లడ్డూలు, స్వామివారి చిత్రపటాన్ని పంపేవారు. రూ.3 వేలు చెల్లిస్తే ఆరునెలలపాటు నెలకు రెండు లడ్డూలు, స్వామివారి చిత్రపటాన్ని పంపిస్తారు. ఈ విషయం టీటీడీ విజిలెన్సు అధికారుల దృష్టికి వచ్చింది. 
 
ఆ వెబ్‌సైట్‌ను గుర్తించిన అధికారులు.. భక్తుల మాదిరిగా లడ్డూల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేశారు. నగదు పంపారు. వీరిచ్చిన చిరునామాకు రెండు లడ్డూలు, శ్రీవారి చిత్రపటం ఉన్న పార్సిల్‌ వచ్చింది. లడ్డూలను పంపిన కొరియర్‌ అడ్ర్‌సపై దాడి చేసి ధనశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి లడ్డూలు, చిత్రపటాలు, ప్రసాదాలు పంపే బాక్సులు, రెండు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు. 
 
శ్రీవారి ప్రసాదాలను అధిక ధరలకు విక్రయించడంతోపాటు టీటీడీ లడ్డూ పేటెంట్‌ను హరిస్తున్నందున ధనశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, విజయ్‌పై చీటింగ్‌, పేటెంట్‌ హక్కు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారులైన మధుసూదన్‌రెడ్డి, విజయ్‌ కోసం ప్రత్యేక బృందాలను బెంగళూరుకు పంపారు.