గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సందీప్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:56 IST)

రోగ నిరోధకశక్తిని పెంచే రాగులు

చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. మన తాతలు, అవ్వలు రాగులను ఆహారంగా తీసుకోవడం వలనే పటిష్టంగా ఉండేవారని కొందరు పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. 
 
రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఫిట్‌గా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. రాగులలో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇవి ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి.
 
ఎసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారికి రాగి జావ అధ్బుత ఔషధం. వేసవిలో ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. రాగులలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు. గ్లూటిన్ సమస్యతో బాధపడుతున్నవారికి రాగులు చాలా మంచి ఆహారం. బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి. రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో దోహదపడతాయి. 
 
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి వారు రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. ఇంకా డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి.
 
ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు కూడా రాగులతో వాటిని నయం చేసుకోవచ్చు. అయితే వర్షా కాలంలో, శీతకాలంలో మాత్రం మోతాదుకు మించి వీటిని తీసుకుంటే అతిశీతలం చేసి జలుబు, అజీర్ణం సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ రెండు కాలాల్లో రాగులను కాస్తంత దూరం పెడితే మంచిది.