శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (16:28 IST)

గొంతులో నొప్పి, మంట... వేడి వేడి సూప్‌తో మాయం..

వర్షాకాలం వచ్చిందంటే తుమ్ములు, దగ్గులు సహజంగానే వస్తుంటాయి. వీటితోపాటు గొంతులో నొప్పి, మంట, గొంతు గరగరలు తరచూ వేధిస్తుంటాయి. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించి, ఆ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చును. అటువంటి చిట్కాలు కొన్ని మీ కోసం.
 
గొంతు సమస్యలకు వేడి వేడి సూప్ ఔషధంలా పనిచేస్తుంది.  మాంసాహారులైతే చికెన్ సూప్ లేదంటే మెంతులూ, పెసలూ కలిపి చేసిన సూప్‌లు ట్రై చేయవచ్చు. చిక్కగా, వేడిగా ఉండే సూప్‌ల వలన గొంతులో గరగర మాయమవుతుంది. 
 
గొంతులో నొప్పి, మంట ఉంటే ఏం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటప్పుడు ఓట్స్‌ను నీళ్లలో ఉడికించి, వేడి వేడిగా తీసుకోవచ్చు. తద్వారా ఆకలి తీరడమే కాకుండా అందులో ఉన్న పీచూ, ఫొలేట్లూ, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ శరీరానికి అందుతాయి. ఓట్స్ మాత్రమే ఉడికించి తినలేని వాళ్లు అందులో అరటి పండు గుజ్జూ, తేనె కలిపి తీసుకుంటే రుచిగానూ ఉంటుంది.
 
వేడి వేడి గ్రీన్ టీలో తేనె కలిపి తీసుకుంటే గొంతుకు చాలా మంచిది. తేనె లోని పోషకాలు గొంతులో చేరిన ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 
గొంతు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు క్యారెట్‌ని తురిమి బాగా ఉడికించి, ఆ గుజ్జును వేడిగా తినాలి. ఈ విధంగా తీసుకోవడం వలన గొంతుకు సాంత్వన లభిస్తుంది. అదేవిధంగా క్యారెట్‌లో ఉన్న పీచు పదార్థాలు, పొటాషియం, సి, కె విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫెక్షలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.