మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (17:52 IST)

అధికారుల అలక్ష్యం... జీ20 నేతల వివరాలు నెట్‌లో లీక్ ఔట్..!

ఆస్ట్రేలియా అధికారులు అలక్ష్యం కారణంగా అంతర్జాతీయ నేతల వివరాలు బహిర్గతమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. 
 
ఆ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 31 మంది వివిధ దేశాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి డేటాను సేకరించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు ఆ దేశాధినేతల నుంచి సేకరించిన వివరాలను పొరపాటున ఇంటర్ నెట్‌లో పోస్ట్ చేశారు. 
 
ఈ విధంగా లీకైన వాటిలో ఆ నాయకుల పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, వారి ప్రయాణ వివరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోల వివరాలు బహిర్గతమైనట్టు సమాచారం.