మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (07:17 IST)

తల్లి నేర్పాలనుకున్న గుణపాఠం.. పిల్లల ప్రాణాలనే హరీమనిపించింది..

తెలుగు సమాజంలో ఒక గజల్ గాయని నాలుగేళ్ల క్రితం గారాబంగా పెంచుకుంటున్న కుక్కను కారులో వదిలేసి మర్చిపోవడంతో గాలి లేక ఊపిరాడక దయనీయ పరిస్థితుల్లో మరణించిన వైనం తెలిసిన వారందరినీ కంట తడిపెట్టించింది. పెంచుకున్న కుక్కను చేతులారా చంపుకున్న బాధతో ఆమె జీవితంల

తెలుగు సమాజంలో ఒక గజల్ గాయని నాలుగేళ్ల క్రితం గారాబంగా పెంచుకుంటున్న కుక్కను కారులో వదిలేసి మర్చిపోవడంతో గాలి లేక ఊపిరాడక దయనీయ పరిస్థితుల్లో మరణించిన వైనం తెలిసిన వారందరినీ కంట తడిపెట్టించింది. పెంచుకున్న కుక్కను చేతులారా చంపుకున్న బాధతో ఆమె జీవితంలో ఇక కుక్కలను పెంచుకోకూడదని కఠోర నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టెక్సాస్‌లో మరొక తల్లి తన పిల్లలను కారులో పెట్టి లాక్ చేసి మర్చిపోయి వారి అనూహ్య మరణానికి కారణం కావడం సంచలనం గొల్పుతోంది.
 
ఓ తల్లి ఇద్దరు పిల్లలపై చూపించిన కోపం వారి ప్రాణాలు తీసింది. పిల్లలను కారులో నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లడంతో వారు వూపిరాడక చనిపోయారు. అయితే తన పిల్లల చావుకి తాను కారణం కాదని ఆ తల్లి మొదట బుకాయించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. టెక్సాస్‌లోని పార్కర్‌ కౌంటీలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
 
మారీ రాండోల్ఫ్‌ అనే 25 ఏళ్ల మహిళ మే 26న తన ఇద్దరు పిల్లలు మృతి చెందారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పిల్లలు బయట ఆడుకుంటున్నారనీ, తాను కాసేపటి తర్వాత వెళ్లి చూసేసరికి వారు కారులో మృతి చెంది ఉన్నారని తెలిపింది. పిల్లల మృతికి కారణాలేంటో తెలియడం లేదని చెప్పింది. 
 
అయితే పోలీసులు ఈ ఘటనలో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా ఆ తల్లి అసలు విషయాన్ని బయటపెట్టింది. ‘ఆ రోజు మధ్యాహ్నం ఇంటి ముందున్న కారులో 2 ఏళ్ల కూతురు, 16 నెలల వయసున్న కుమారుడు ఆడుకుంటున్నారు. వారిని కారు నుంచి బయటకు రావాల్సిందిగా కోరాను. అయితే వారు బయటకి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో గుణపాఠం చెప్పాలని కోపంతో వారిని కారులోనే లాక్‌ చేసి నేను ఇంటిలోకి వెళ్లిపోయాను. అనంతరం టీవీ చూస్తూ, బట్టలు సర్దుతూ ఇంటిలోనే ఉండిపోయా. అరగంట అనంతరం కారు వద్దకి వచ్చి చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు.’ అని ఆమె అసలు విషయం వెల్లడించింది. 
 
కారులో ఆ సమయంలో అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల పిల్లలు వూపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. పిల్లల మృతికి తల్లే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.