శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (09:49 IST)

ఆ 92 మంది జలసమాధి అయినట్టే : ఇండోనేషియా ఆర్మీ అధికారులు

గత నెలలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియాకు చెందిన క్యూజడ్ 8501 విమాన ప్రయాణికుల్లో 92 మంది జలసమాధి అయినట్టేనని మృతదేహాల కోసం గత నెల రోజులుగా అన్వేషించిన ఇండోనేషియా ఆర్మీ అన్వేషణ బృందం ప్రకటించింది. అయితే, దీనిపై ఇండోనేషియా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది. ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న అన్వేషణ బృందంలోని పలువురు సభ్యులు కూడా అనారోగ్యం పాలైనట్టు ఆ బృందం ఉన్నతాధికారులు వెల్లడించారు. అందువల్ల ఇంతటితో గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
గత నెలలో ఎయిర్ ఏషియాకు చెందిన విమానమొకటి జావా సముద్రంలో కుప్పకూలిన విషయం తెల్సిందే. ఈ విమాన ప్రమాద మృతదేహాల అన్వేషణను ఇండొనేసియా మిలిటరీ ఉన్నతాధికారులు చేపట్టారు. ఆ విమానంలో మొత్తం 162 మంది ఉండగా, ఇప్పటి వరకు 70 మృతదేహలను వెలికితీశారు. వాతావరణం అనుకూలించకపోవడం, మృతదేహల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో, బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురైయ్యారని అధికారులు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో సెర్చ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మరో 92 మంది మృతదేహాలను వెలికితీయాల్సి వుంది. ఇక వారంతా జలసమాధి అయినట్టు మలేషియా ప్రభుత్వం అధికారికి ప్రకటన వెలువరించనుంది. గత సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బందితో సహా 162 మందితో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం విదితమే.