శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:33 IST)

చైనాకు షాకిస్తున్న భారత్ : ఇండియాకు తరలిరానున్న కంపెనీలు

చైనాకు భారత్ పదేపదే షాకిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద డ్రాగన్ కంట్రీ ఆర్మీకి తేరుకోలేని విధంగా ఇండియన్ ఆర్మీ షాకిచ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం తన దౌత్యనీతిని ప్రదర్శిస్తూ చైనాకు పదేపదే షాకిస్తోంది. ఇప్పటికే, చైనాకు చెందిన అనేక యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో ఈ యాప్ కంపెనీలన్నీ ఆర్థికంగా భారీగా నష్టపోయాయి. అలాగే, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గతంలో ఎన్నడూ లేనంతగా కఠిన ఆంక్షలు విధించింది. ఇపుడు చైనా నుంచి నిష్క్రమిస్తున్న కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 
 
తాజాగా చైనాలోని 24 కంపెనీలు భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో దిగ్గజాలుగా పేరుగాంచిన ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి సంస్థల అసెంబ్లింగ్‌ భాగస్వాములు చైనా నుంచి భారత్‌కు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మొబైల్‌ ఫోన్‌ కర్మాగారాల ఏర్పాటు నిమిత్తం ఈ సంస్థలు భారత్‌లో 1.5 బిలియన్‌ డాలర్ల (రూ.11,217 కోట్ల)మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు 'బ్లూమ్‌బర్గ్' వెల్లడించింది. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తి, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ కంపెనీలు తమ సైప్లె చైన్లను ఇతర దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఆపిల్‌ భావిస్తున్నట్టు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఆపిల్‌కు వివిధ రకాల విడిభాగాలను సరఫరా చేయడంతోపాటు ఐఫోన్లను అసెంబ్లింగ్‌ చేస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థ కూడా చెన్నైకి సమీపంలోని తమ ప్లాంట్‌లో రానున్న మూడేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల (రూ.7,478 కోట్ల) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఐఫోన్ల ఉత్పత్తిని చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్‌ ఇప్పటికే తమ భాగస్వాములకు గట్టిగా విజ్ఞప్తి చేసినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.