మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By raju
Last Modified: చెన్నై , శనివారం, 1 జులై 2017 (06:50 IST)

చరిత్ర పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు., చైనా హెచ్చరికపై జైట్లీ ధ్వజం

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు 2017 అని గుర్తుంచుకో చైనా అంటూ భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర హెచ్చరిక చేశారు. భూటాన్‌లోని డోక్లాం వివాదాస్పద ప్రాంతం నుంచి భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటేనే భారత్‌తో అర్ధవంతమైన చర్చలు జరుపు

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు 2017 అని గుర్తుంచుకో చైనా అంటూ భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ  తీవ్ర హెచ్చరిక చేశారు. భూటాన్‌లోని డోక్లాం వివాదాస్పద ప్రాంతం నుంచి భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటేనే భారత్‌తో అర్ధవంతమైన చర్చలు జరుపుతామని, చైనా చేసిన హెచ్చరికలను జైట్లీ తిప్పికొట్టే సాహసం చేశారు. భారత్‍‌పై ఆరోపించే ముందు సిక్కిం సెక్టార్‌లో తమరేం చేస్తున్నారో ఒకసారి వెనక్కు చూసుకోవాలని రక్షణమంత్రి జైట్లీ చైనాను ఎద్దేవా చేశారు. 
 
భారత ఆర్మీ.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ దీటుగా బదులిచ్చారు. ప్రస్తుత భారత్‌ 1962 నాటి భారత్‌కు భిన్నమైందని హెచ్చరించారు. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది చైనానే అని మండిపడ్డారు.
 
1962 నాటి యుద్ధాన్ని ఉద్దేశించి చైనా చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ‘1962 నాటి పరిస్థితి భిన్నమైంది. 2017 నాటి భారత్‌ భిన్నమైంది’ అని అన్నారు. భారత్‌ సరిహద్దులో ఉన్న వివాదాస్పద ప్రాంతం తమదేనని భూటాన్‌ స్పష్టం చేసిందని, దీని భద్రతపై భారత్, భూటాన్‌ల మధ్య ఒప్పందం ఉందని ఆయన వెల్లడించారు.
 
బీజింగ్‌ డోక్లాం నుంచి తమ సేనలను వెనక్కి తీసుకొంటేనే భారత్‌తో అర్థవంతమైన చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. డోక్లాంపై చైనాకు వివాదరహిత సౌర్వభౌమాధికారం ఉందని పేర్కొంది. జూన్‌ 18న భారత బలగాలు సరిహద్దు దాటి తమ దేశంలోని డోంగ్లాంగ్‌ ప్రాంతంలోకి చొరబడ్డాయని పేర్కొంది.

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేసినట్టు కేంద్రం శుక్రవారం తెలిపింది. వివాదాస్పద చైనా–భారత్‌ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. దీంతో 400 మంది మానస సరోవర యాత్రికులు నిరాశకు గురయ్యారు. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్‌ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగనుంది.