గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:35 IST)

హమాస్ సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తాం!

గాజాలో హమాస్ సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి తీరుతామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఈ సొరంగ మార్గాన్ని ధ్వంసం చేస్తామని సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో గత 24 రోజులుగా సాగిస్తున్న తన దాడులను మరింత విస్తృతం చేయడానికి ఇప్పుడున్న సైనికులకు తోడుగా అదనంగా మరో 16 వేల సైనికులను సంసిద్ధం చేసింది. 
 
గత 24 రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 1374 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందడం తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. 
 
తమ భూభాగంలోకి చొరబడడం కోసం హమాస్ నిర్మించిన అన్ని సొరంగ మార్గాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేసారు. తాము ఇప్పటికే డజన్ల సంఖ్యలో సొరంగ మార్గాలను ధ్వంసం చేసామని, కాల్పుల విరమణతో సంబంధం లేకుండా మిగతా సొరంగ మార్గాలన్నిటినీ ధ్వంసం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేసారు. 
 
అంతేకాదు ఇజ్రాయెల్ సైన్యాలు వేల సంఖ్యలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసాయని, వందలమంది టెర్రరిస్టులను హతమార్చాయని కూడా ఆయన చెప్పారు. ఈ క్లిష్టసమయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.