శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (11:09 IST)

కరోనా నుంచి పూర్తిగా కోలుకోని డోనాల్డ్ ట్రంప్.. వణికిపోతున్న వైట్‌హౌస్ సిబ్బంది

కరోనా వైరస్ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆయన వెంట ఉండే వైట్‌హౌస్ సిబ్బంది వణికిపోతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, భయంభయంతో విధులు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ బారినపడిన ట్రంప్ రెండు మూడు రోజుల పాటు అమెరికా సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ వైరస్ నుంచి ఆయన పూర్తిగా కోలుకోకముందే తిరిగి తన అధ్యక్ష కార్యాలయమైన శ్వేతసౌధానికి చేరుకున్నారు. దీంతో పైగా, మాస్క్ తీసేసి తిరుగుతున్నారు. దీంతో వైట్‌హౌస్ సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. 
 
ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ, 'రిస్క్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నాను. నా శరీరంలో వ్యాధి నిరోధకత ఉండి ఉండవచ్చు. నేను చేసినట్టుగా ఏ నాయకుడూ చేయలేడు. నేను వెనక్కు తగ్గబోను. నా ప్రత్యర్థి బైడెన్‌తో 15న జరుగనున్న మియామీ డిబేట్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేనే ముందుంటాను. నేనే నాయకత్వం వహిస్తాను' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇదిలావుండగా, ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆయన కోలుకునేందుకు మరో వారం రోజుల సమయమన్నా పడుతుందని ట్రంప్ ప్రత్యేక వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌కు ఇప్పటివరకూ నాలుగు డోస్‌ల రెమిడెసివిర్‌ను వైద్యులు ఇచ్చారని అన్నారు. 
 
ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే, కరోనా బారినపడిన వారు కనీసం 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, ట్రంప్ మాత్రం వారి వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోకుండా వైట్‌హౌస్‌లో యధేచ్చగా తిరుగుతున్నారు.