దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిపై దాడి
దక్షిణ, ఉత్తరకొరియాలు విలీనం కావాలంటూ అమెరికా రాయబారిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ముఖంపైన, చేతిపైన గాయాలయ్యాయి. ఆయనపై దాడిని అమెరికా అధ్యక్షుడు ఖండించాడు. వివరాలిలా ఉన్నాయి.
సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వుండగా ఆయనపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో లిప్పర్ట్ ముఖంపై చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన లిప్పర్ట్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా లిప్పర్ట్ ప్రాణానికేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు భద్రతా సిబ్బంది దాడి చేసిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన లిప్పర్ట్ తో ఫోన్ లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ దాడిని సౌత్ కొరియా- అమెరికా మైత్రిపై జరిగిన దాడిగా సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అభివర్ణించారు.మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియా ఏకంకావాలంటూ దుండగుడు నినాదాలు చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.