బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (10:33 IST)

దక్షిణ సిరియాలో ఉగ్రవాదుల హతం.... నైజీరియాలో ఉగ్రవాదుల కనికరం!

దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా 117 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు.. నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్న బందీల పట్ల కాస్త కరుణ చూపి, 192 మందికి ప్రాణభిక్ష పెట్టారు. వేర్వేరు దేశాల్లో జరిగిన సంఘటనల వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ సిరియాలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. సైన్యం జరిపిన దాడుల్లో 117 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో అల్‌ఖైదాతో సంబంధాలున్న 47 మందిని మషారా పట్టణంలో, దక్షిణ ప్రావెన్స్ లోని దర్రార్లో 70 మందిని అంతమొందించినట్లు పేర్కొంది. 
 
అలాగే, బోకో హరామ్ తీవ్రవాదులు తమవద్ద వున్న బందీలపై కాస్తంత కనికరం చూపారు. తీవ్రవాదులు అపహరించిన వారిలో దాదాపు 192 మంది బందీలను విడుదల చేశారని నైజీరియా సైనిక ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. విడుదలైన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. తీవ్రవాదులు రెండు ట్రక్కుల్లో బందీలను డమత్తురు సమీపంలోని గిర్భువా గ్రామంలో విడిచిపెట్టారని వివరించారు. జనవరి మొదటి వారంలో నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని యొబో గ్రామం నుంచి 218 మందిని బోకో హరామ్ తీవ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే.