బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (17:10 IST)

భారత్ - అమెరికా మధ్య అణు ఒప్పందం అత్యంత కీలకం : నరేంద్ర మోడీ

ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్ అమెరికాల పౌర అణు ఒప్పందం అత్యంత కీలకమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీకి వచ్చిన అమెరికా అధినేత బరాక్ ఒబామాతో కలిసి ఆయన సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణు ఒప్పందం కుదిరిన ఆరు సంవత్సరాలకు మరింత ముందుకు పోవడం హర్షణీయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకతను మోడీ నొక్కివక్కాణించారు. 
 
అంతేకాకుండా, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలన్నారు. శాతి, రక్షణ, వాణిజ్యం వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొనాలని, సహాయ సహకారాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంత కాలంగా అమెరికాతో ఉత్సాహబరితమైన బంధాన్ని, మరిన్న రంగాలకు విస్తరించి బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు.
 
వాణిజ్య ఒప్పందాలు అంతర్జాతీయ, జాతీయ ఒప్పందాలకు లోబడి ముందుకు సాగుతాయన్నారు. రక్షణ, భద్రత ఒప్పందాలపై మరింత ముందుకు సాగుతామని చెప్పారు. అణు ఒప్పందంలో అడుగు ముందుకేశామన్నారు. పౌర అణు ఒప్పందం రెండు దేశాల సంబంధాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాల ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
అభివృద్ధి చెందేందుకు వర్తక, వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారం అందుతుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సహకారం, సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సమావేశాలు విరివిగా జరుగుతాయని ఆయన తెలిపారు.