శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:13 IST)

డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడ్చిన అమెరికా ప్రజలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అమెరికా ప్రజలు కోర్టుకీడ్చారు. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమర్జెన్సీని విధించడాన్ని అమెరికాలో 16 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ 16 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్రంప్‌ను కోర్టుకీడ్చారు. ఈ 16 రాష్ట్ర ప్రభుత్వాలకు కాలిఫోర్నియా రాష్ట్రం నాయకత్వం వహిస్తోంది. 
 
అక్రమ వలసలను అడ్డుకునేందుకు వీలుగా అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించాలన్న పట్టుదలతో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇందుకోసం అవరమైన నిధుల సేకరణ అసాధ్యంగా మారింది. దీంతో దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తద్వారా నిధులు సమీకరణ సులభతరమవుతుందని భావించారు. కానీ, 16 రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డెమోక్రాట్లు కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అధ్యక్ష అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేస్తున్నారంటూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గ్జేవియర్ బెసిరా ఆరోపించారు. 
 
వాల్ ప్రాజెక్టు కోసం ట్రంప్ అక్ర‌మ ప‌ద్ధ‌తిలో నిధులు సేక‌రిస్తున్నార‌ని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పైగా, గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమర్జెన్సీని విధించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ, ట్రంప్‌ను కోర్టుకీడ్చాయి. 16 రాష్ట్రాలు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. ట్రంప్ త‌న ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత కోర్టులో ఈ కేసు వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. 
 
కాగా, ఎమర్జెన్సీని విధించడం వల్ల 3200 కిలోమీట‌ర్ల పొడుగు ఉన్న మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి 8 బిలియన్ల డాలర్లు వస్తాయని ట్రంప్ భావిస్తున్నారు. నిజానికి ఈ మొత్తం చాలా తక్కువ. ఈ గోడ నిర్మాణానికి 23 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు అవుతుందని భావిస్తున్నారు.