శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (13:28 IST)

భారత్-అమెరికాల సంబంధాలు.. చైనా సాయం కోరిన పాక్!

భారత్-అమెరికాల మధ్య భద్రత రంగాల్లో సంబంధాలు పటిష్టమవుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు చైనాను సాయం కోరింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) టాప్‌ జనరల్‌తో బీజింగ్‌లో సమావేశ మయ్యారు.
 
ఢిల్లీ, వాషింగ్టన్‌ నుంచి విమర్శలు ఎక్కువవుతున్న తరుణంలో ఉగ్రవాద గ్రూపులపై విరుచుకుపడేందుకు తాము చేస్తున్న కృషికి చైనా మద్దతును పొందారు.
 
ఇరువురు జనరల్స్‌ జరిపిన సమావేశంలో భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవడం గురించి చర్చించారు. పాకిస్థాన్‌ వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో ఉగ్రవాద మూకలపై పాకిస్థాన్‌ తీసుకున్న చర్యలను చైనా ప్రశంసించినట్లు తెలుస్తోంది. 
 
చైనాలోని ముస్లింలు అధికంగా ఉన్న జిన్‌జియాంగ్‌ రీజియన్‌లో జరిగిన దాడుల వెనుక ఈస్ట్‌ టర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ ఉందని, దీని స్థావరాలు పాకిస్థాన్‌లో ఉన్నా యని చైనా గతంలో ఆరోపించింది. ఈ సంస్థపై పాకిస్థాన్‌ చేపట్టిన చర్యలను కూడా చైనా ప్రశంసించిందని పాకిస్థాన్‌ నివేదికలు పేర్కొం టున్నాయి.  
 
ఇకపోతే.. ఇండియా, యూఎస్‌ నుంచి ఉగ్రవాద నిర్మూలన చేయాలని ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ చేస్తున్న కృషికి చైనా మద్దతు ప్రకటించడం గమనార్హం. 
 
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి జాన్‌ కెర్రీ ఈనెల ప్రారంభంలో ఇస్లామాబాద్‌లో పర్యటించారు. భారత్‌, అమెరికా, ఆఫ్ఘనిస్థాన్‌ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న అన్ని మిలిటెంట్‌ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చారు.