శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (16:00 IST)

భారత్ - చైనాల మధ్య యుద్ధం తథ్యమా? సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల తోపులాట (Video)

భారత, చైనాల మధ్య యుద్ధం అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. పైగా, ఈ సైనికులు తోపులాటకు దిగడంతో యుద్ధం తథ్యమనే రక్షణ రంగ నిపుణులు అభి

భారత, చైనాల మధ్య యుద్ధం అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. పైగా, ఈ సైనికులు తోపులాటకు దిగడంతో యుద్ధం తథ్యమనే రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూటాన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ డోకాలా ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డును భార‌త సైన్యం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనివున్నాయి. 
 
భార‌త జ‌వాన్లే అక్ర‌మంగా త‌మ భూభాగంలోకి ప్ర‌వేశించార‌ని చైనా ద‌ళాలు మ్యాప్‌ విడుదల చేయడమే కాకుండా, ఇండియన్ జ‌ర్నలిస్టుల‌ ప్ర‌వేశాన్ని కూడా చైనా ర‌ద్దు చేసింది. ఈ చర్యపై భారత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. యుద్ధ ప‌రిస్థితి వ‌స్తే చైనా, పాక్‌ల‌ను ఎదుర్కునేందుకు భార‌త ఆర్మీ సిద్ధ‌మ‌ని ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల కూడా చైనా స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా చైనా హద్దులు మీరుతోంది. ఇప్పటివరకు స్టాండ్-ఆఫ్‌కే పరిమితమైన చైనా సైన్యం ఇప్పుడు భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హద్దులు మీరి ప్రవర్తిస్తున్న చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ నిలువరిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. 
 
భారత సైన్యం సంయమనం పాటిస్తూ బలప్రయోగంతో వారిని అడ్డుకుంటోంది. అయినప్పటికీ వారు తమ భూభాగంలోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ నోటికి పనిచెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. చైనా సైనికులు తమ భూభాగాన్ని దాటి భారత్ భూభాగంలోకి చొచ్చుకురావడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది.
 
ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సిక్కిం సరిహద్దు వద్దే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇరు దేశాలకు చెందిన 3 వేల మంది సైనికులు ఇరువైపులా మోహరించారు. డోకాలా ప్రాంతంలో భారత సైన్యం ఏర్పాటు చేసిన బంకర్లను తొలగించాల్సిందిగా జూన్ 1న చైనా.. భారత్‌ను కోరింది. అందుకు భారత ఆర్మీ నిరాకరించడంతో అదే నెల 6వ తేదీన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలవంతంగా తొలగించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా రక్షణ రంగ నిపుణులు స్పందిస్తూ.. డోకాలా వివాదంపై ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ విష‌యంలో ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గేలా లేవ‌న్నారు. అవ‌స‌ర‌మైతే యుద్ధానికి కూడా వెళతాయని, డోకాలా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను స‌రిగా తీర్చుకోలేక‌పోతే యుద్ధం ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు నిదర్శనం ఈ వీడియోనే. మీరూ చూడండి.