గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (17:16 IST)

'మోడీ మంత్రా'.. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు: చైనా మీడియా

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చైనా మీడియా ఆకాశాకెత్తేసింది. మోడీ పరిపాలనపై అగ్రరాజ్యాలతో పాటు పలు దేశాలు ప్రత్యేక దృష్టి పెడ్తున్న నేపథ్యంలో ఆయన పాలనా దక్షతపై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ మోడీపై కథనం ప్రచురించింది. ముఖ్యంగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యాలయాల పనితీరు విశేషంగా మెరుగుపడిందని పేర్కొంది. సిబ్బంది సమయపాలన, ఆఫీసు పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపింది.
 
కార్యాలయాల్లో మంత్రుల తనిఖీలు, ఫైళ్ళ పెండింగ్ పట్ల వారు అధికారులకు ఆదేశాలు జారీచేయడం, మంత్రులు తమ వద్దకొచ్చిన ఫైళ్ళను వెంటనే క్లియర్ చేయడం, ఆఫీసుల్లో పాత ఫర్నిచర్ స్థానే నూతన సామగ్రి అమర్చడం... వంటి మార్పులు 'మోడీ మంత్రా'కు నిదర్శనమని సదరు పత్రిక కొనియాడింది. గత ప్రభుత్వ హయాంలో బూజుపట్టిన ఫైళ్ళను సైతం తాజా క్యాబినెట్ ఆగమేఘాలపై పరిష్కరిస్తోందని పేర్కొంది.
 
అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాగే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైలెంటుగా ఉంటున్నారని పలు ఆరోపణలు వస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ సైలెంటుగానే పని చేసుకుపోతున్నారని చైనా మీడియా ‘గ్లోబల్ టైమ్స్' మంగళవారం ప్రచురించిన తన కథనంలో పేర్కొంది. నరేంద్ర మోడీ రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఆయన తన విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది.