ముంబై దాడుల సక్సెస్ను నా భార్య ప్రశంసించింది : డేవిడ్ హెడ్లీ
బాబా అణు విద్యుత్ కేంద్రపై దాడి చేసేందుకు వీడియో తీసి ప్లాన్ వేసినట్టు తీవ్రవాది డేవిడ్ వెల్లడించారు. ఈ వీడియోను పాకిస్థాన్ ఐఎస్ఐకు ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, ముంబైలోని నావెల్ ఎయిర్ స్టేషన్, సిద్ధి వినాయక్ ఆలయంపై దాడిని తాను అడ్డుకున్నట్లు చెప్పారు. ముంబై దాడులపై హెడ్లీ తన సాక్ష్యాన్ని శుక్రవారం కొనసాగించారు.
ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించి అమెరికాలోని ఒక రహస్య ప్రదేశం నుంచి వీడియో కాల్ ద్వారా డేవిడ్ హెడ్లీ నాలుగో రోజు తన సాక్ష్యాన్ని కొనసాగించారు. బాబా ఆజ్మీ గురుసెక్ సెంటర్, బార్క్ వీడియో తీసి ఐఎస్ఐకు చెందిన మేజర్ ఇక్బాల్కు అందించినట్లు తెలిపారు. బార్క్ శాస్త్రవేత్తలను ఐఎస్ఐ ఏజెంట్లుగా నియమించాలని ఇక్బాల్ తనకు పురమాయించాడని చెప్పారు.
ముంబై దాడుల సమయంలో ఛాబాద్ హౌస్ను టార్గెట్ చేసుకునేందుకు ఒక కారణం ఉందని హెడ్లీ వివరించారు. ఇజ్రాయెల్ నుంచి యూదులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ దాడి చేయాలని లష్కరే తోయిబా తమ సభ్యులకు పురమాయించినట్లు తెలిపారు. నిజానికి ముంబైలోని నావెల్ ఎయిర్ స్టేషన్ సిద్ధి వినాయక్ ఆలయంపై దాడికి వ్యూహం పన్నాలని లష్కరే ఉగ్రవాద సంస్థ తమ సభ్యులను ఆదేశించిందని, అందుకు తాను అడ్డు తగిలానని హెడ్లీ చెప్పారు. అక్కడ భద్రత పటిష్టంగా ఉంటుందని, ఆ రెండు ప్రదేశాల్లో దాడి చేయడం దుశ్సాహసమే అవుతుందని చెప్పినట్టు వెల్లడించారు.
అంతేకాకుండా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖయిదాకు కూడా పనిచేసినట్లు స్పష్టం చేశాడు. నేషనల్ డిఫెన్స్ కాలేజీపై గతంలో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ముంబై దాడులను సక్సెస్పుల్గా చేపట్టినందుకు తనను మెచ్చుకుంటూ తన భార్య ఈ-మెయిల్ పంపినట్లు తెలిపాడు. 2008 నవంబర్ 28న తనకు ఆ మెయిల్ వచ్చిందన్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాట్స్. సంబరాలు ఘనంగా జరిగాయని ఫైజా మెయిల్ చేసిందని హెడ్లీ చెప్పాడు.