ప్రవాస భారతీయుడి హత్య కేసులో నిందితుడికి ఉరి
ఓ ప్రవాస భారతీయుడిని చంపిన కేసులో సింగపూర్ కోర్టు నిందితుడికి కఠిశిక్షే విధించింది. చోరీ చేసిందే కాకుండా హత్య చేసినందుకుగానూ ఏకంగా ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించినందుకు మరొకరికి జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి.
భారత్కు చెందిన షణ్ముఖనాథన్ (41) సింగపూర్లో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. అయితే 2010లో మే 29 అర్థరాత్రి షణ్ముఖ్ నివాసంలో మలేసియాకు చెందిన గారింగ్, టోని లంబాలు చోరీకి యత్నించారు. ఆ సమయంలో షణ్ముఖ్తోపాటు అతని రూమ్లోని ముగ్గురు ప్రతిఘటించారు.
దీంతో ఆగ్రహించిన గారింగ్ షణ్ముఖ్ను హత్య చేశాడు. మిగతా వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గారింగ్తోపాటు లంబా చోరీ చేసి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు ఇటీవలే పూర్తయ్యాయి. గారింగ్, లంబాలను నేరస్తులుగా భావించిన హైకోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసింది. గారింగ్ కు ఉరి, లంబాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.