గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (16:50 IST)

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ పిడుగు... ఉద్యోగుల్లో భయాందోళనలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థుల విషయంలో ట్రంప్ అవలంభించిన వైఖరి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నిర్ణయంపై స్వద

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థుల విషయంలో ట్రంప్ అవలంభించిన వైఖరి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నిర్ణయంపై స్వదేశంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఇతర దేశాల ఉద్యోగుల వంతు వచ్చింది. 
 
అమెరికా ప్రతినిధుల సభలో హెచ్‌-1బీ వీసాల సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఇచ్చే కనీస వేతనం రూ.60 వేల డాలర్ల స్థానంలో కంపెనీలు కనీస వేతనంగా లక్షా 30 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వేతనం ఉన్న ఇతర దేశాల ఐటీ ఉద్యోగులను వారివారి స్వదేశాలకు పంపించాల్సి వస్తుంది. తద్వారా ఖాళీ అయ్యే ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించాలని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే, 50 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు ఇచ్చే 20 శాతం వీసా కోటా తొలగించడం జరుగుతుంది. 
 
దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది భారత ఐటీ కంపెనీలే. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో భారత ఐటీ కంపెనీల్లో వణుకు మొదలైంది. ఉద్యోగులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీని ప్రభావం వల్ల మార్కెట్లలో ఐటీ షేర్లు పతనమయ్యాయి. అమెరికా ఇస్తున్న హెచ్-1బీ వీసాలను అత్యధిక స్థాయిలో వినియోగించుకుంటున్న దేశం భారత్ కావడం గమనార్హం. దీంతో ట్రంప్ తీసుకున్న ఈ సంస్కరణ బిల్లు వల్ల ఎక్కువగా నష్టపోయేది కూడా భారతీయులేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అందులోనూ తెలుగు రాష్ట్రాల వాళ్లే హెచ్-1బీ వీసాలు ఎక్కువగా పొందుతున్నారని అమెరికా రాయబార కార్యాలయం వర్గాల సమాచాం. విదేశాల్లో పనిచేసేందుకు హెచ్-1బీ, ఎల్-1 వీసాల ద్వారా వెళ్లే వారిపై నియంత్రణ విధిస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.