హఫీజ్పై కేసు లేదు.. స్వేచ్ఛాజీవి : అబ్దుల్ బాసిత్ వెల్లడి
ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్పై ఎలాంటి కేసూ పెండింగ్లో లేదని, పాకిస్థాన్ పౌరుడైన హఫీజ్కు పాక్లో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని, హఫీజ్తో ఎలాంటి సమస్యా లేదని భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. సయీద్ నిర్దోషిగా కోర్టులు ఇదివరకే ప్రకటించాయని ఢిల్లీలో ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన భారత్ హఫీజ్ను వెంటనే అరెస్ట్ చేసి, కోర్టు విచారణకు అప్పగించాలని డిమాండ్ చేసింది.
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యంతో కలసి హఫీజ్ సయీద్ ఎందుకు పని చేస్తున్నాడని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. హఫీజ్ సయీద్ను న్యాయస్థానాలు నిర్దోషిగా పేర్కొన్నాయని, ప్రస్తుతం అతనిపై ఎటువంటి కేసులూ పెండింగ్లో లేవని అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబైలో తీవ్రవాద దాడులకు పాల్పడిన దుష్ట శక్తులను తెరవెనుక నుంచి నడిపిన ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీదేనని భారత్ పునరుద్ఘాటించింది.
‘హఫీజ్పై మా అభిప్రాయాలను ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాం. 2008 నవంబర్ 26న ముంబైలో నరమేథం సృష్టించిన తీవ్రవాద మూకలను తెరవెనుక నుంచి నడిపించింది అతనే. కనుక అతడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. ఈ విషయంలో మరో మాటకు తావే లేదు’ అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సరూద్ అక్బరుద్దీన్ సోమవారం న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు.