ఆప్ఘన్లకు నరకం చూపిన అమెరికా సైన్యం.. ఆధారాలు దొరికాయ్.. ఇక అరెస్టులే తరువాయి..
9/11 దాడుల అనంతరం ఆప్ఘనిస్థాన్పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది ఆప్ఘన్లను పాశవికంగా హింసించిందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా తిప్పలు తప్పేలా లే
9/11 దాడుల అనంతరం ఆప్ఘనిస్థాన్పై యుద్ధం చేసిన అమెరికా సైన్యం.. 2003-04 సమయంలో వందలాది మంది ఆప్ఘన్లను పాశవికంగా హింసించిందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా తిప్పలు తప్పేలా లేవు. ఆప్ఘన్లపై అమెరికా ఆర్మీ అకృత్యాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని హేగ్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ప్రాసిక్యూటర్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. దీని ప్రకారం అమెరికా సైనికులతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఏజెంట్లలో కొద్దిమందిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అల్ ఖైదా, దాని ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను ముట్టుపెట్టేందుకు ఆప్ఘన్ గడ్డపై కాలుమోపిన అమెరికా సైన్యాలు ఉగ్రవాదులనే కాక సాధారణ పౌరులకు సైతం నరకం చూపించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ అన్నారు. కాన్సంట్రేషన్ క్యాంపుల తరహాలో ఆప్ఘన్లో తమ చేతికి చిక్కినవారిని హింసించేందుకు అమెరికన్లు గదులు నిర్మించారని, సీఐఏ ఆధ్వర్యంలోనే హింసా కార్యక్రమాలు నడిచాయని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
ఇందులో భాగంగా కనీసం 61 మంది అఫ్ఘాన్లను అమెరికా సైనికులు, మరో 27 మందిని సీఐఏ ఏజెంట్లు టార్చర్ పెట్టినట్లు ఆధారాలు లభించాయని, అంతర్జాతీయ నేర చట్టాలను అనుసరించి ఆయా ఘటనకు కారకులైనవారిపై వారెంట్లు జారీచేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. అయితే దీనిని ఐసీసీ లైట్గా తీసుకుంటున్నట్లు తెలిసింది.